ఫేక్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్: ఓ ఫ్యామిలీ నుంచి రూ. 19 కాజేసిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: కరోనా కష్టకాలంలో నకిలీ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ను తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాచారంకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్ను జవహార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కుషాయిగూడ కు చెందిన ఓ కుటుంబాన్ని నకిలీ కోవిడ్ రిపోర్ట్లతో మోసం చేశాడు.
కోవిడ్ లక్షణాలు ఉండటంతో తెలిసిన వ్యక్తి కదా? అని కిరణ్ని సంప్రదించారు సదరు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో వారి ఇంటికొచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసిన కిరణ్... ఓ ల్యాబ్లో టెస్ట్ చేయించానంటూ క్యూఆర్ కోడ్తో సహా ఫేక్ పత్రాలను ఆ కుటుంబానికి పంపాడు. అనుమానం వచ్చి ఆ ల్యాబ్ను సంప్రదించిన సదరు కుటుంబానికి అసలు నిజం తెలిసింది. కిరణ్ ఎవరో వారికి తెలియదని ఆ టెస్ట్లు ఇక్కడ జరగలేదని ఆ ల్యాబ్ నిర్వాహకులు తెలిపారు.
కాగా, బాధిత కుటుంబం నుంచి పలు టెస్ట్ల కోసం రూ. 19 వేలు కాజేశాడు కిరణ్. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నిందితుడు కిరణ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబ్స్లోనే పరీక్షలు చేసుకోవల్సిందిగా రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ సూచించారు.
తెలంగాణలో 3వేలకుపైగా కొత్త కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 97,236 నమూనాలను పరీక్షించగా కొత్తగా 3,527 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,71,044కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 19 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3226కి చేరింది.
Recommended Video
గత 24 గంటల్లో 3982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,30,025కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్యశాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.49 కోట్లకుకుపైగా నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 92.81 శాతం ఉంది. మరణాల రేటు 0.56శాతంగా ఉంది.