నాలుగేళ్లుగా పాక్ జైల్లో-ప్రియురాలి కోసం వెళ్లి-ఎట్టకేలకు విముక్తి-తల్లిదండ్రులను చేరిన టెక్కీ ప్రశాంత్
పాకిస్థాన్లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రియురాలిని కలుసుకునే ప్రయత్నంలో నాలుగేళ్ల క్రితం అనుకోకుండా పాక్ భూభాగంలోకి అడుగుపెట్టాడు ప్రశాంత్. అప్పటినుంచి అతన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు,ఆయన కుటుంబ సభ్యులు అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ప్రశాంత్ ఎట్టకేలకు తిరిగి తన తల్లిదండ్రులను చేరుకోగలిగాడు. జీవితంలో తల్లిదండ్రుల మాటను పెడ చెవిన పెట్టినందుకు నాలుగేళ్లు పాకిస్తాన్లో చిక్కుకుపోయానని ఈ సందర్భంగా ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలేం జరిగింది...
ప్రశాంత్ అనే యువకుడు హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. 2017లో స్విట్జర్లాండ్లో ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో వీసా,పాస్ పోర్ట్ లేకుండా పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టాడు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అక్కడి జైల్లోనే బంధీగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ను ప్రశాంత్ తండ్రి బాబూరావు అప్పట్లో కలిశారు. తన కుమారుడిని విడిపించేలా చొరవ తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ పోలీసుల కృషితో..
ప్రశాంత్ను పాకిస్తాన్ చెర నుంచి విడిపించేందుకు మాదాపూర్ పోలీసులు చాలా కృషి చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపేలా చేశారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో పాకిస్తాన్ ప్రశాంత్ను విడుదల చేసింది. వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ప్రశాంత్ను భారత అధికారులకు అప్పగించారు. అక్కడినుంచి అధికారులు ప్రశాంత్ను హైదరాబాద్ పోలీసులు ప్రశాంత్ను నగరానికి తీసుకొచ్చారు. అనంతరం సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రశాంత్ను అతని తల్లిదండ్రులకు అప్పగించారు.ప్రశాంత్ విడుదలకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విదేశాంగ శాఖ అధికారులకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.
Recommended Video
భావోద్వేగానికి గురైన ప్రశాంత్
నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు తల్లిదండ్రులను చేరిన ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. అసలు పాక్ నుంచి భారత్కు తిరిగి వస్తానని అనుకోలేదన్నాడు. 'హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే మళ్లీ తల్లిదండ్రులను చూడగలిగా. నా సమస్యను భారత్-పాక్ మధ్య సమస్యగా చూడకూడదు. పాకిస్థానీయులు అంత చెడ్డవారేమీ కారు. రెండు దేశాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉన్నారు. జైల్లో ఉన్నన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకున్నా. నాలుగేళ్లలో హిందీ మాట్లాడటం నేర్చుకున్నా. జైలులో భారతీయులతో పని చేయించరు. జైలులో భారతీయుల కోసం ప్రత్యేక గదులు ఉండేవి. నేను వెళ్లే ముందు మా అమ్మ నన్ను ఆపేందుకు ప్రయత్నించింది. తల్లిదండ్రుల మాటలు వినకపోతే జీవితంలో కష్టాలు వస్తాయి. అమ్మ మాట విననందుకు నాలుగేళ్లు కుటుంబానికి దూరమయ్యా' అంటూ ప్రశాంత్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.