ఐటిలో హైదరాబాద్ బెంగళూర్ను దాటేస్తుంది: కెటిఆర్
ముంబై: ఐటీ రంగంలో త్వరలోనే బెంగళూరును అధిగమిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కెటిరామారావు ప్రకటించారు. మరి కొద్ది సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో బెంగళూరును అధిగమించి నెంబర్ 1 నగరంగా మారుతుందని ఆయన అన్నారు. ముంబైలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ ఐటీ రంగం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నదని కేటీఆర్ చెప్పారు. నగరంలోని ఐటీ సంస్థల్లో 3.25 లక్షల మంది ఉద్యోగులు ఉండగా గత 12 నెలల కాలంలోనే అదనంగా 15వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయని మంత్రి చెప్పారు.
దేశంలోని ఏ ఇతర రాష్ర్టాల్లో కూడా ఇంత భారీగా ఉద్యోగాల కల్పన జరగలేదని వివరించారు. అలాగే ఐటీ రంగంలో దేశవ్యాప్త వృద్ధి రేటు 13 శాతం కాగా తెలంగాణ రాష్ట్రం 16శాతం అభివృద్ధి సాధించి దేశంలోనే ముందంజలో ఉందని చెప్పారు. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చేపట్టిన విధానాలు ఈ రంగంలో భారీ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంనుంచి రూ.60వేల కోట్లు ఆర్థిక ఎగుమతులు ఉన్నాయని, వీటిని లక్ష కోట్లకు చేర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
పెట్టుబడులు పెట్టేందుకు దేశంలో అత్యంత అనువైన రాష్ట్రం తెలంగాణయేనని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కేటీఆర్ పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్తో కలిసి పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున హాజరైన బహుళజాతి, దేశీయ ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగ పారిశ్రామిక దిగ్గజాలనుద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు తమ ప్రభుత్వం సానుకూల వాతావరణంలో సహకరిస్తున్నదని తెలిపారు. న్యూయార్క్, లండన్, టోక్యో, ముంబైల మాదిరిగా హైదరాబాద్ను గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాలకు తమ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని వివరించారు. పారిశ్రామికాభివృద్ధికి అనేక కార్యక్రమాలను వినూత్నంగా ప్రవేశపెట్టిందని చెప్పారు.