వీడిన మిస్టరీ: ప్రేయసి కోసం వెళ్లిన హైదరాబాదీ మృతి
హైదరాబాద్: ప్రేయసి కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లిన హైదరాబాదీ మరణించాడు. హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన పబ్బతి వినయ్(20) అనే యువకుడు తాడేరు గ్రామానికి వచ్చి కాలువలో కొట్టుకుపోయి వారం రోజుల అనంతరం మృతదేహమై తేలాడు.
ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరులో చోటు చేసుకుంది. అల్వాల్కు చెందిన వినయ్ ఆకివీడుకు చెందిన మెరుగు మరియమ్మను ప్రేమించాడు. మరియమ్మ కుటుంబం కూడా హైదరాబాద్లో స్థిరపడింది. మరియమ్మ కుటుంబంలోని వారికి ఈ ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో మరియమ్మను ఆకివీడు స్వగ్రామం పంపించారు.
ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న వినయ్ ఆకివీడు చేరుకున్నాడు. అక్కడి నుంచి వారిద్దరూ తాడేరులోని మరియమ్మ బంధువుల ఇంటికి వెళ్ళారు. వారు కూడా ప్రేమ వ్యవహారంపై దూషించడంతో ఇద్దరూ కలిసి ముందు చనిపోవాలనుకున్నారు. అనంతరం పారిపోయి వివాహం చేసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఈ నెల 21న గునుపూడి సౌత్ డ్రైయిన్ దాటుతుండగా ప్రమాదవశాత్తు వినయ్ కాలువలో పడి గల్లంతయ్యాడు. మరియమ్మ మాత్రం ఒడ్డుకు చేరింది.
ఈ వి షయంపై మరియమ్మ భీమవరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి రూరల్ ఎస్ఐ ఎన్. శ్రీనివాసరావు వినయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టా రు. మృతదేహం గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా ఏటిపర్రు వద్ద లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వినయ్ బంధువులు మాత్రం - మరియమ్మ బంధువులు వినయ్ని హత్య చేశారని ఆరోపిస్తూ దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.