విమోచన వేడుకలు - అమిత్ షా కీలకంగా : ఏక్నాథ్ షిండే - కర్ణాటక మంత్రి సైతం..!!
తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రం తొలి సారిగా అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వేడుకల నిర్వహణ ఆసక్తి కరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయం నుంచి ఈ వేడుకల నిర్వహణ పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయ యుద్దంలో భాగంగా కేంద్రం విమోచనం పేరున..ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమైక్యతా దినోత్సవం పేరున వేర్వేరుగా ఇదే రోజున వేడుకలు నిర్వహిస్తున్నాయి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. కేంద్ర విభాగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Live: 75th Hyderabad Liberation Day Celebrations, Parade Grounds, Secunderabad https://t.co/tHmRsPqFIa
— G Kishan Reddy (@kishanreddybjp) September 17, 2022
సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళి అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ విలీనం సమయంలో ఇప్పటి మహారాష్ట్ర - కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని భాగాలు తెలంగాణలో కలిసి ఉన్నాయి. దీంతో..ఇప్పుడు కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విమోచన వేడుకల్లో ఆ రెండు రాష్ట్రాలను భాగస్వాములను చేసింది.
విలీనం అయిన ప్రాంతాల్లోనూ వేడుకల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే..కర్ణాటక మంత్రి బీ శ్రీరాములు హాజరయ్యారు. ఇక, హైదరాబాద్ లో విమోచన వేడుకలను బీజేపీ నేతలు నిర్వహిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ విలీనం గురించి కీలక అంశాలు వెల్లగించారు.హైదరాబాద్ను పాకిస్థాన్లో కలపాలని నిజాం చూశారని వ్యాఖ్యానించారు.
దేశ సమైక్యతకు సర్దార్ బలమైన నిర్ణయాలు తీసుకొన్నారని చెప్పారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు. దేశ సమైక్యత కోసం అందరూ ముందుకు కదలాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఇక, బీజేపీ కార్యాలయంలో వల్లభ్భాయ్ పటేల్ చిత్ర పటానికి నివాళులర్పించిన బండి సంజయ్ ..జాతీయ జెండా ఎగుర వేసారు.
పటేల్ కృషి వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందని సంజయ్ చెప్పారు. ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణకు విముక్తి లభించిందని గుర్తు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అసెంబ్లీలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాల వద్ద స్పీకర్ పోచారం నివాళులు అర్పించారు. అసెంబ్లీలో స్పీకర్.. మండలిలో ఛైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.