కూకట్పల్లి కాదు.. కూకటివేళ్లతో పెకిలిస్తా: పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు
ఖమ్మం: రాజకీయంగా ఎదుర్కోలేక.. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. తాను ఖమ్మంలోనే ఉంటానని.. ఖమ్మం ప్రజలను వదిలి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు.
ఖమ్మం నుంచే బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రయాణం
తాను కూకట్పల్లి నుంచి పోటీ చేయనని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. కూకట్పల్లి నుంచి పోటీ చేస్తానని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం నగరం యావత్ తెలంగాణకు ఆదర్శమని అన్నారు. ఖమ్మం నగరం నుంచి బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. తమ నగరం నుంచే బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రయాణానికి నాంది పడుతున్నందన ఆ పార్టీ అధినేత కేసీఆర్కు అన్ని రకాలుగా అండగా ఉంటామని, ఈ సభకు తరలివచ్చి చూపించాలని ప్రజలకు సూచించారు.
కూకట్పల్లికి పోను.. కూకటివేళ్లతో పెకిలిస్తానంటూ పువ్వాడ అజయ్
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన చుట్టూ అబద్ధాలు అల్లుతూ ఉంటారన్నారు పువ్వాడ అజయ్. బీజేపీకి వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు.. మన దగ్గర ఓ అబద్ధాల గ్రూప్ ఉంటుందని.. ఈ గ్రూప్ పనేంటంటే.. పువ్వాడ అజయ్ని గెలవనివ్వొద్దని.. ఈసారి హ్యాట్రిక్ కు కొడితే ఇగ పువ్వాడను అడ్డుకోవడం కష్టమని.. అందుకే తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారని పువ్వాడ చెప్పారు. తాను కూకట్పల్లికి పోనని.. తనకు పోటీగా వచ్చేటోళ్లనే కూకటివేళ్లతో ఓడగొడతానని పువ్వాడ అజయ్ తేల్చి చెప్పారు. కాగా, ఈ సన్నాహక సభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
దేశాభివృద్ధి కోసమే బీఆర్ఎస్ అంటూ తుమ్మల నాగేశ్వరరావు
ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలో తలెత్తుకునేలా కేసీఆర్ చేశారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారన్నారు. మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశమంతా జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారని వ్యాఖ్యానించారు. తెలంగాణలానే దేశాన్ని అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ గా మారిందన్నారు ఎంపీ రవిచంద్ర. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు.