'నాకు ఇంతకంటే పెద్ద పదవి రాదన్న హరీశ్..' కేటీర్ కి లైన్ క్లియర్ చేశారా..?
సంగారెడ్డి : నంబర్ గేమ్ పాలిటిక్స్ ప్రస్తుత రాజకీయాల్లో చాలా కామన్ గా కనిపించే అంశం. అధినేతల తర్వాతి వరుసలో ఉండేవారికే ఆ తర్వాత పాలనా పగ్గాలు అప్పజెప్పే ఆనవాయితీ ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తుండడంతో ఆయా పార్టీల్లో నంబర్-2 స్థానం ఎప్పుడూ చర్పనీయాంశంగానే ఉంటోంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లోను సీఎం కేసీఆర్ తర్వాతి స్థానం ఎవరిది..? కేసీఆర్ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగించెది కేటీఆరా..? హరీశ్ రావా..? అన్నదానిపై గతకొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ తో ఈ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
'నా జీవితంలో ఇదే పెద్ద పదవి.. ఇంతకంటే పెద్ద పదవి రాదు..' అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ రాజకీయాలకు ఆపాదిస్తూ.. కేసీఆర్ తర్వాతి స్థానం కేటీఆర్ దే అన్న విషయం హరీశ్ రావు పరోక్షంగా చెప్పుకొచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని తేల్చి చెప్పారు.
నీళ్ల కోసం ప్రాజెక్టులు.. ప్రాజెక్టుల కోసం భూసేకరణ తప్పదు..
మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో విపక్షాల ఆందోళనను తప్పుబట్టిన హరీశ్ రావు.. విపక్షాలు ముంపు బాధితులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. తెలంగాణ బిడ్డలుగా ప్రాజెక్టుల విషయంపై ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని చెప్పిన ఆయన.. రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా..! సాగునీరు రావాలన్నా..! ప్రాజెక్టుల కట్టక తప్పదని, అందుకోసం భూసేకరణ కూడా తప్పదని అన్నారు. జిల్లాలోని 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించి తనను ఆదరించిన మెదక్ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.
ఈ చేతితో రిజిస్ట్రేషన్లు.. ఆ చేతితో చెక్కులు..
ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పిన హరీశ్ రావు.. రిజిస్ట్రేషన్లు, చెక్కుల పంపిణీ ఒకే విడుతలో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయంపై చర్చించడానికి ముంపు గ్రామాలకు చెందిన 50 మంది ప్రతినిథులతో స్వయంగా చర్చలు జరిపినట్టు చెప్పిన ఆయన, జీవొ 123 ఐచ్చికం లేదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నడుచుకుంటామని ముంపు గ్రామాల ప్రతినిథులతో చెప్పినట్టు తెలిపారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పథకాల్లో 50% పథకాలను ముంపు గ్రామాల వారికే దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రాజెక్టుపై ప్రతిపక్షాల రాజకీయాలు
మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. '123 జీవో అనేది మ్యూచువల్ కన్సెంట్ అవార్డు. రైతు అంగీకరిస్తేనే భూసేకరణకు ప్రభుత్వం సిద్దపడుతుంది. పైగా భూసేకరణ చట్టం 2013 కంటే ఈ చట్టం ద్వారా నిర్వాసితులకు ఎక్కువ డబ్బులు పరిహారంగా అందుతాయని' చెప్పారు.
ప్రస్తుతం ఎకరాకి దాదాపు రూ.6 లక్షల మేర పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. అలాగే సాగుభూమిలో బోరు, బావి, చెట్లు చేమ, పైపులైన్లు.. లాంటివి ఏమైనా ఉంటే వాటికీ కూడా అదనంగా నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఈ లెక్కన సగటున ఒక్కో ఎకరానికి రూ.7 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు నిర్వాసితులకు పరిహారం అందుతుందని తెలిపారు.
కాగా, నష్ట పరిహారం కింద చెల్లించే మొత్తాన్ని 15 రోజుల్లోనే వాళ్ల చేతుల్లో పెడుతున్నామన్నారు. భూసేకరణకు అడ్డుంకులు తొలగిపోతే ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయెచ్చనే ఉద్దేశంతోనే ఈ జీవోను తెచ్చినట్టుగా చెప్పారు. భూ సేకరణ చట్టం 2013లో ఆ వెసులుబాటు ఇంత వెసులుబాటు ఉండదని చెప్పిన ఆయన.. 123 జీవో కింద భూసేకరణకు అంగీకరించని రైతు వద్ద భూసేకరణ చట్టం ద్వారానే భూమిని సేకరిస్తామని చెప్పారు.