ఆ పార్టీలో 20 ఏళ్లు ఉన్నా.. స్వీట్ బాక్స్ తప్ప బీ ఫారం ఇవ్వలేదు: మంత్రి పద్మారావు
కాంగ్రెస్ పార్టీలో ఎంత పని చేసినా ప్రోత్సాహం ఉండదని, ఇరవై ఏళ్ల పాటు పని చేసిన తాను ఓ స్వీట్ బాక్స్ అందుకోవడం తప్ప, పార్టీ నుంచి బీ ఫారం అందుకున్న పాపాన పోలేదని తెలంగాణ మంత్రి పద్మారావు చెప్పారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఎంత పని చేసినా ప్రోత్సాహం ఉండదని, ఆ పార్టీలో ఉన్నన్నాళ్లూ తన సర్వస్వం కోల్పోయానని తెలంగాణ మంత్రి పద్మారావు చెప్పారు. శాసనమండలిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఇరవై ఏళ్ల పాటు పని చేసిన తాను ఓ స్వీట్ బాక్స్ అందుకోవడం తప్ప, పార్టీ నుంచి బీ ఫారం అందుకున్న పాపాన పోలేదని అన్నారు.
గుడుంబా నిర్మూలన, పునరావాసంపై శాసనమండలిలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పద్మారావు గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడన్న విషయాన్ని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. ఇందుకు పద్మారావు స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రత్యామ్నాయ పార్టీలు లేకపోవడంతో తెలంగాణ ఉద్యమంలో చేరానని, ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికై అసెంబ్లీకి, శాసనమండలికి రాగలిగానని చెప్పిన ఆయన, తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టేవాడిని కాదేమోనని మంత్రి పద్మారావు అభిప్రాయపడ్డారు.