ఆ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నా... అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నా.. : సీఎం కేసీఆర్
రైతు వేదికల నిర్మాణంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు నిర్మించిన దాఖలా లేదన్నారు. అభివృద్ది చెందిన అమెరికా,యూరోప్ లాంటి దేశాల్లోనూ రైతులకు ప్రత్యేక వేదికలు లేవన్నారు. 'రైతు చాలా పెద్దవాడు... వినడానికి బాగానే ఉంది... కానీ కూర్చొనే మాట్లాడుకునే స్థలం లేదు. ఎవరిది వారే... ఆగమాగం పరిస్థితి.. అందుకే రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలు తీసుకొచ్చాం.' అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు.

కొనుగోలు ధరపై కేంద్రం ఆంక్షలు...
'వేరే దేశాల్లో ప్రభుత్వాలు అక్కడి రైతులకు గొప్పగా సబ్సిడీ ఇస్తాయి. కానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వవద్దని ఆంక్షలు పెడుతుంది. సన్నపు వడ్లయినా,దొడ్డు వడ్లయినా రూ.1880కే రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని... అంతకుమించితే తీసుకునేది లేదని ఎఫ్సీఐ ఆదేశాలిచ్చింది. రైతుల పట్ల కేంద్రం వైఖరికి నిదర్శనం ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ కళ్లు తెరిపించాలంటే మనమంతా పిడికిలి ఎత్తాలి. కేంద్రానికి తెలంగాణ నుంచి హెచ్చరిక వెళ్లాలి. అప్పటివరకూ రైతులను కేంద్రం పట్టించుకోదు..' అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఆ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నా...
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే జనగామ జిల్లాకు వచ్చి మీటింగ్ పెడితే... ఆనాడు సభలో ఒక్క యువకుడు కూడా కనిపించలేదు. ఏమైందని ఆరా తీస్తే... యువకులంతా బతుకపోయినరు అని చెప్పారు. ఏడేళ్ల కరువు... కి.మీ దూరం బండి మీద వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నాం... రెండు మూడు రోజులకోసారి స్నానాలు చేస్తున్నాం అని చెప్పారు. ఆ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నా. అట్లాగే మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డకు వెళ్లినప్పుడు,నల్గొండ ఫ్లోరైడ్ గడ్డకు వెళ్లినప్పుడు... ఉరితాళ్లకు వేలాడే రైతులను చూసి బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాను. అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక దేశంలోనే మన రైతాంగాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని ప్రతిజ్ఞ తీసుకున్నాను..' అని కేసీఆర్ తెలిపారు.

ఆ విషయంలో... ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ...
ప్రస్తుతం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల పంటను కొనుగోలు చేయట్లేదు. రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కరోనా కారణంగా రైతులను రిస్క్లో పెట్టవద్దని... అధికారులే స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చాను.ప్రభుత్వానికి నష్టం వచ్చినా మంచిదే... రైతుల కోసం ఎంతదాకైనా వెళ్లాలని ఆ నిర్ణయం తీసుకున్నాను. రైతులు ఇప్పుడు ఒక్క గింజ కూడా బయట అమ్ముకునే అవసరం లేదు. అధికారులే మీ వద్దకు కొనుగోలు చేస్తారు.' అని స్పష్టం చేశారు.

రైతులను సంఘితం చేసేందుకు...
రైతు వేదికల నిర్మాణానికి రూ.600కోట్లు ఖర్చు పెట్టినట్లు కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 95శాతం రైతు వేదికలు పూర్తయినట్లు చెప్పారు. ఇంకో వారం రోజుల్లో మిగతావన్నీ పూర్తవుతాయని చెప్పారు. రైతు వేదిక ఒక ఆటం బాంబ్ అని... రైతులను సంఘటితం చేసే అద్భుత శక్తి అని చెప్పారు. అమ్మబోతే అడవి... కొనబోతే కొరివి... అన్న పరిస్థితి లేకుండా చేసేందుకే రైతుల కోసం ఈ వేదికలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తద్వారా రైతులు తమ గొంతు వినిపించేందుకు,తమ ప్రాతినిధ్యాన్ని చాటి చెప్పేందుకు అవకాశం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications