ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే: కూన, రూ.135కే గ్రేడ్ వన్ కందిపప్పు: ఈటెల
హైదరాబాద్: తన ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే కొనసాగుతానని సనత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కూన వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బేగంపేటలో శుక్రవారంటీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూన వెంకటేష్ మాట్లాడుతూ, పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలే రాబోయో రోజుల్లో తగిన రీతిలో బుద్ది చెబుతారన్నారు.
అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల కాలంలో పార్టీ మారని వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, వారి బెదిరింపులకు తాము లొంగబోమని పేర్కొన్నారు.
వాటర్గ్రిడ్ పథకంలో భాగంగా జిల్లాకు రూ.2,855 కోట్లు: మంత్రి హరీష్
వచ్చే వేసవిలో మెదక్ జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మందుస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాటర్గ్రిడ్ పథకంలో భాగంగా జిల్లాకు రూ.2,855 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆయన శుక్రవారం తెలిపారు.
జనవరి నుంచి రెండవ దశ మిషన్ కాకతీయ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.
రూ.135కే గ్రేడ్ వన్ కందిపప్పు
రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఇకపై రూ. 135కే గ్రేడ్ వన్ కందిపప్పు లభించనుంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మిల్లర్లు అంగీకరించారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో పప్పు అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మిల్లర్లు మంత్రి ఈటెలకు హామీ ఇచ్చారు.
దీంతో పాటు పప్పు మిల్లుల వద్దనే నేరుగా కందిపప్పు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇది ఇలా ఉంటే శనివారం ఎర్రగడ్డ రైతు బజార్లో కంది పప్పు కేంద్రాన్ని మంత్రి ఈటెల ప్రారంభించనున్నారు.