బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం: తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు
వర్షాకాలం ముగిసినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని, సాయంత్రం చల్లగా ఉండటంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ నగరంలో వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపింది. కాగా, హైదరాబాద్లో గురువారం ఉదయం నుంచీ మేఘావృతమై.. చల్లని వాతావరణం కొనసాగుతోంది.

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 18 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి పెరుగుతున్న క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారు, వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అవసరమైతే తప్ప చలి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వెచ్చటి దుస్తులు ధరించాలని చెబుతున్నారు. వేడిగా ఉన్నప్పుడే ఆహార పదార్థాలను తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మరోవైపు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గుంటూరు, కడప, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, శ్రీసత్యసాయి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications