2019లో ప్రాంతీయ పార్టీలదే హవా, కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయం : కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా.. రాష్ట్రంలో అమలైన సంక్షేమ అభివృద్ది పథకాల గురించి, భవిష్యత్తు రాజకీయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను, ఆయన ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అమలులోకి తెచ్చిన టీఎస్ఐపాస్ పారిశ్రామిక పాలసీతో 15 రోజుల వ్యవధిలోనే కొత్తగా 1700 పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రాష్ట్రంలో 40 వేల కోట్ల పెట్టుబడులు సమకూరడమే కాకుండా, 1.2 లక్షల మందికి ఉపాధి లభించిందని చెప్పారు.
ఐటీ రంగంలో ఇంక్యూబేషన్ ఏర్పాటు, సంక్షేమానికి సంబంధించి ఫించన్ల పంపిణీ,కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. అలాగే 2018 వరకు రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేస్తామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 2016 నాటికి 6,200 గ్రామాలకు తాగు నీళ్లందించడం, 2021 నాటికి 80 నుంచి 90 లక్షల వరకు సాగునీరందించే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇక దేశ భవిష్యత్తు రాజకీయాలపై స్పందించిన సీఎం కేసీఆర్.. భవిష్యత్తు రాజకీయంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అన్నారు. 2019లో ప్రాంతీయ పార్టీల చేతిలోనే దేశ రాజకీయ పగ్గాలుంటాయని చెప్పిన ఆయన, ఇందులో టీఆర్ఎస్ ముఖ్య పాత్రను పోషించబోతుందని చెప్పుకొచ్చారు. 2019లో 100 శాతం ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుందని నమ్మకంగా చెప్పిన కేసీఆర్, జాతీయ పార్టీలేవి అంత గొప్ప స్థాయిలో ఏమి లేవన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ లోక్ సభలో పూర్తి స్థాయి మెజారిటీని సాధించలేదని, ఇందులో చక్రం తిప్పబోయేది ప్రాంతీయ పార్టీలేనని అన్నారు. దేశంలో 200 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ బీజేపీ మధ్య ముఖాముఖి తలపడే పరిస్థితి ఉందని మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉండబోతుందన్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పార్టీ తరుపున ఏ వ్యూహం అనుసరించాలనేది అప్పటి పరిస్థితుల అంచనా మేరకు నిర్ణయిస్తామని చెప్పారు. ఇక కరువు సహాయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలేమి చేయలేదన్న అమిత్ షా వ్యాఖ్యలను చీప్ కామెంట్స్ అంటూ తప్పుబట్టారు.
అలాగే కేంద్రంలో భాగస్వామిగా చేరడానికి టీఆర్ఎస్ సిద్దంగా ఉందా అన్న ప్రశ్నకు.. మేం చాలా శుభ్రంగా, స్వతంత్రంగా సాగిపోతున్నాం. అలాంటి ఆలోచనలేమి లేవని తెలియజేశారు.