గ్రేటర్ హైదరాబాద్ లోని నిరుపేదలకు తీపికబురు.. 7 చోట్ల మీకు ఇందిరమ్మ ఇళ్ళు!
ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల నిజం చేయటానికి సంకల్పించిన తెలంగాణా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా పేదలకు శుభవార్త చెప్పింది. గూడు లేని వారికి గూడు కల్పించే పనిలో ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతీ జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో ఇళ్ళ నిర్మాణాలు, గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక తాజాగా హైదరాబాద్ లో ఇల్లు లేని నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
నిరుపేదలఇళ్ళ కోసం ప్రభుత్వ కసరత్తు
ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భూముల గుర్తింపు పనులు తీవ్రంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలతో రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖల అధికారులు ప్రభుత్వ భూములను సర్వే చేస్తున్నారు. వివాదాలు లేని ప్రభుత్వ భూములను ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే నగరంలోని ఏడు ముఖ్య ప్రాంతాల్లో స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం గమనార్హం.

ఈ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణానికి ప్లాన్
నాంపల్లి నియోజకవర్గంలోని కుల్సంపురలో 4.3 ఎకరాల్లో 620 ఇళ్ల టవర్ నిర్మాణం, మల్లేపల్లిలో 4.20 ఎకరాల్లో 680 ఫ్లాట్లు, రెడ్హిల్స్లో 2 ఎకరాల్లో 270 ఫ్లాట్లు నిర్మించనున్నారు. మలక్పేటలో ఓల్డ్ క్వార్టర్స్ ఆర్బీ కాలనీలో 4.7 ఎకరాల్లో 630 ఫ్లాట్లు, గడ్డిఅన్నారంలో 9.11ఎకరాల్లో 1,400 ఫ్లాట్లు, బహదూర్పురలో ఫారూఖ్నగర్లో 4 ఎకరాల్లో 600 ఫ్లాట్లు, కూకట్పల్లిలో 5 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలంలో ఇళ్ల నిర్మాణం చేయటానికి నిర్ణయించారు .
ఈ ప్రాంతాలలో స్థలాలు అధికారికంగా గుర్తింపు
మిగతా నియోజకవర్గాల్లో కూడా భూముల గుర్తింపు కొనసాగుతోంది. మేడ్చల్లో పోచారం ఎల్ఐజీ కాలనీ, ఖైరతాబాద్లో హకీంపేట్ దర్గా ప్రాంతం, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. బండ్లగూడలోని తట్టిఅన్నారం, ఫతుల్గూడ వంటి చోట్ల ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను వినియోగించనున్నారు.
హైదరాబాద్ లో అర్హులైన పేదలకు సొంతిల్లు
ఈ పథకం ద్వారా హైదరాబాద్లోని అర్హులైన పేదలు, కార్మికులు, నిర్మాణ కార్మికులు వంటి వర్గాలు బహుళ అంతస్తుల ఇళ్లలో సొంత నివాసం పొందుతారు. వివాదాలు లేని స్థలాలను మాత్రమే ఎంపిక చేయడం ద్వారా నిర్మాణం విషయంలో ఇబ్బంది ఎదురు కాదని భావిస్తున్నారు.
త్వరలో వీరికి సొంతిల్లు
అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి నివేదికను త్వరలో సమర్పించనున్నారు. దీని తర్వాత ఆయా ఎంపిక చేసిన స్థలాలలో పేదలకు ఇళ్ళ నిర్మాణం చేపడతారు. అయితే స్థలం లేని నిరుపేదలు కావటం తో వీరికి బహుళ అంతస్తుల భవనాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తారు.












Click it and Unblock the Notifications