టీటీడీ తరహాలో యాదాద్రి బోర్డు.. చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త, చిరంజీవి సతీమణికి స్థానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట నరసింహ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి కొత్త ఊపిరి పోసేందుకు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 18 మంది సభ్యులతో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది.
యాదగిరిగుట్ట బోర్డుకు చైర్మన్ గా ఔషధరంగ పారిశ్రామిక వేత్త.. చిరంజీవి సతీమణికి చోటు
ఈ బోర్డు కు చైర్మన్ గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త, ఎంఎస్ ఎన్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమించింది. ఈ పాలకమండలిలో మెగాస్టార్ చిరంజీవి సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి వంటి ప్రముఖులకు చోటు దక్కటం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నూతన బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పనిచేస్తుంది.

వ్యాపార రంగంలో సత్తా చాటిన మన్నె సత్యనారాయణ రెడ్డి
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుకు చైర్మెన్ గా నియమించబడిన మన్నె సత్యనారాయణ రెడ్డి ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి రెండు పీహెచ్డీలు చేసిన ఉన్నత విద్యావంతుడు. వ్యాపార రంగంలో గణనీయమైన విజయాలను సాధించి ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థను విస్తరించిన వ్యక్తి. మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డికి సోదరుడు.
సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా వీరు
ఇక యాదగిరిగుట్ట బోర్డు సభ్యులలో చిల్లప్ప గారి విజయరాజం, తూళ్ళ విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, స్వాతి కాంతిమణి, గుండు మల్లయ్య, ఎం రాఘవేంద్రరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ యాదాద్రి జిల్లా కలెక్టర్ వై టి డి ఏ వైస్ చైర్మన్ ఆలయ ఈవో, స్థానాచార్యులు తదితరులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.
రెండేళ్లపాటు పదవిలో వీరు
ఫౌండర్స్ ట్రస్టీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యుల పదవీకాలం రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. దీనికి సంబంధించి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఈ బోర్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి సతీమణి సురేఖకు స్థానం దక్కటం విశేషం. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications