రేషన్ పంపిణీ షురూ.. లబ్దిదారులకు శుభవార్త.. అలా చేసేవారిపై చర్యలు.. వార్నింగ్!
రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త. జులై నెల వచ్చేసింది, ఈ నెలలో మీ రేషన్ సరఫరా నేటి నుండి ప్రారంభం అవుతుంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు రేషన్ సరఫరా జరుగుతుంది. నేటినుండి మొత్తం 2.15 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 3.41 కోట్ల మంది పేదలు, సామాన్యులు ప్రత్యక్ష లాభం పొందనున్నారు.
రేషన్ షాపులకు బఫర్ స్టాక్
ప్రభుత్వం ఆహార భద్రతను బలోపేతం చేయడం కోసం ముందస్తు ప్రణాళికలు చేసింది. గతంలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల వల్ల గోదాముల్లో నిల్వ సమస్య ఎదుర్కొన్న నేపథ్యంలో, ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ముందుగానే పంపిణీ చేసి గోదాముల ఒత్తిడి తగ్గించింది. దీంతో జులై నెలకు అవసరమైన బఫర్ స్టాక్ ఇప్పటికే అన్ని రేషన్ షాపులకు చేర్చడం పూర్తయింది.

రేషన్ లబ్దిదారులకు అలెర్ట్
లబ్ధిదారులు ఎలాంటి ఆలస్యం లేకుండా, మొదటి రోజు నుంచే తమ కేటాయింపు బియ్యాన్ని సులభంగా తీసుకోవచ్చు. పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ వ్యవస్థలో పారదర్శకత, నాణ్యతను కాపాడటం కోసం కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈ-పాస్ బయోమెట్రిక్ వ్యవస్థ, డిజిటల్ తూకాల యంత్రాలను తప్పనిసరిగా ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు.
బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ లపై కఠిన చర్యలు
క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని, డిజిటల్ బరువు తూకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. ఒక్క గ్రాము కూడా తక్కువ ఇవ్వకుండా, నాణ్యమైన బియ్యం మాత్రమే లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ లాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలు, కార్మిక వర్గాలు ఆర్థిక భారం నుంచి కొంతవరకు ఉపశమనం పొందుతారు.
ఆధార్ లింక్ తో రేషన్
ప్రభుత్వం కేంద్రం నుంచి కేటాయించిన కోటాలో గతంలో 95 శాతం పంపిణీ చేసి రికార్డు సాధించింది. ఇలాంటి చర్యలు ఆహార సరఫరా వ్యవస్థను మరింత బలంగా చేస్తాయి. లబ్ధిదారులు తమ రేషన్ కార్డులు, ఆధార్ లింక్తో షాపులకు వెళ్లి సరైన విధంగా బియ్యం తీసుకోవాలి. ఎక్కడైనా రేషన్ బియ్యం పక్కదారి పట్టిన సంఘటనలు గమనించిన వారు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు













Click it and Unblock the Notifications