కోవిడ్ 19 వ్యాక్సిన్ అని చెప్పి... వృద్ద దంపతులకు మత్తు ఇంజెక్షన్... ఆపై నగలతో పరార్...
కోవిడ్ 19 వ్యాక్సిన్ పేరుతో వృద్ద దంపతులకు మత్తు మందు ఇచ్చి ఆభరణాలు చోరీ చేసిన ఘటన హైదరాబాద్లోని మీర్పేటలో చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం బాధితుల ఇంటి పక్కనే అద్దెకు దిగిన ఓ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఈ చోరీకి పాల్పడింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితురాలిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే... మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ లలితానగర్లో కుంతాల లక్ష్మణ్ (80), కస్తూరి (70) అనే వృద్ద దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బెంగళూరులో, చిన్న కుమారుడు దుబాయ్లో స్థిరపడ్డారు. దీంతో హైదరాబాద్లోని నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు.
ఇదే క్రమంలో కొద్ది నెలల క్రితం వికారాబాద్కు చెందిన విజయ్-అనూష దంపతులు వారి పక్కింట్లో అద్దెకు దిగారు. విజయ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా అనూష బీఎస్సీ నర్సింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే వృద్ద దంపతులతో అనూష కలుపుగోలుగా మాట్లాడేది. ఇలా ఆ ఇద్దరితో పరిచయం పెంచుకుని తరుచూ వారి ఇంటికి వెళ్లి వస్తుండేది.
ఇటీవల విజయ్ అనూష దంపతులు అదే కాలనీలోని మరో ఇంట్లో అద్దెకు వెళ్లారు. శుక్రవారం(ఫిబ్రవరి 12) అనూష ఆ వృద్ద దంపతుల ఇంటికి వచ్చి మళ్లీ మాటలు కలిపింది. తాను గర్భవతిని అని,ప్రస్తుతం 8 నెలతో ఉన్నానని చెప్పింది. తల్లిగారింటికి వెళ్లే ముందు ఒకసారి చూసి వెళ్దామని వచ్చానని... మీకోసం పాయసం తీసుకొచ్చానని చెప్పింది. అందులో మత్తు మందు కలుపుకుని వచ్చిన అనూష... వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే నగలతో ఉడాయించాలనుకుంది. అయితే ఆ పాచిక పారలేదు.
ఆ వృద్ద దంపతులు ఆమె తెచ్చిన పాయసం తినేందుకు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయిన అనూష.. మరుసటిరోజు మళ్లీ వారి ఇంటికి వెళ్లింది. తాను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నానని... కోవిడ్ 19 టీకా ఇచ్చేందుకు వచ్చానని చెప్పింది.అయితే దానికి కూడా వారు నిరాకరించారు. దీంతో బలవంతంగానే వారికి ఆమె ఇంజెక్షన్ ఇచ్చారు. అది మిడోజాలం అనే మత్తు ఇంజెక్షన్ కావడంతో ఇద్దరూ అపస్మారక స్థితిలోకి జారుకున్నారు.
ఆ వెంటనే ఆ వృద్దురాలి ఒంటిపై ఉన్న నగలను దొంగిలించి అనూష ఉడాయించింది. కాసేపటికి స్పృహలోకి వచ్చిన వృద్ద దంపతులు నగలు చోరీ అయిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక ఎస్ఐ రంగంలోకి దిగి కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా రెండే గంటల్లో అనూషను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేశారు.