ఇంటర్ ఫెయిల్ ...పురుగుల మందు తాగి చావుతో పోరాడి కన్నుమూసిన విద్యార్థిని
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాల రగడ కొనసాగుతుంది . విద్యార్థుల బలవన్మరణాలు ఆగటం లేదు. తాజాగా మరో విద్యార్థిని ఇంటర్ ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని మృతిచెందిన సంఘటన తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది .

ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని మరో విద్యార్థిని ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం వెంగన్నపాలెనికి చెందిన మానస అనే విద్యార్థిని ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసింది. తానూ పరీక్షలు బాగా రాశానని , మంచి మార్కులు వస్తాయని భావించిన మానసకు నిరాశ మిగిలింది. ఉన్నత చదువులు చదవడానికి కూడా ప్లాన్ చేసుకున్న మానస విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తాను ఫెయిల్ అయ్యానని తెలిసి ఆ బాధను తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన మానస పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచిన మానస అనే విద్యార్థిని
అయితే అది గమనించినకుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మానస పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో మానసను ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పురుగుల మందు తాగి ప్రాణాలతో పోరాడిన మానస మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందింది. మానస మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కొనసాగుతున్న ఆత్మహత్యలు .. ఫలితాలకు సంబంధం లేదన్న అధికారులు
తెలంగాణలో ఇంటర్మిడియట్ ఫలితాలు వెలువడిన దగ్గరి నుండి విద్యార్థులు ఫెయిల్ అయ్యామని వరుస ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకపక్క ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పినా విద్యార్థులు మాత్రం ప్రాణాలు వదులుతూనే ఉన్నారు. కాగా ఇప్పటికి తెలంగాణలో విద్యార్ధిని, విద్యార్థులు సూమారు 25 మంది ప్రాణాలను వదిలారు . కాగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాత్రం ఫలితాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడలేదని చెప్పటం గమనార్హం.












Click it and Unblock the Notifications