భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య: కొత్తపేటలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కమలానగర్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిపై భాగం నుంచి కిందికి దూకడంతో తల పగిలి ఆమె అక్కడికక్కడే మరణించింది.
మృతురాలిని తుకారాంగేట్ సిఐ అర్జన్ కూతురు చంద్రికగా గుర్తించారు. బాలిక స్థానికంగా ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాదులోని కొత్తపేటలో గల ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో చుట్టుపక్కలవాళ్లు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు.
ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు సిలిండర్లు, ఐదు వాహనాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.