ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతికి ఊరట: తెలంగాణ కేడర్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు
హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి సుదీర్ఘ కాల ఎదురుచూపులకు తెరపడింది. ఆయనను తెలంగాణ కేడర్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం జీవో 583 జారీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్రం ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది.
అయితే, ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించారు అభిషేక్ మొహంతి. తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు. వాదనలు విన్న క్యాట్.. అభిషేక్ మొహంతిని తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మొహంతిని విధుల నుంచి రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని, విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది.

ట్రైబ్యూనల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. దీంతో తెలంగాణ ముఖ్య కార్యదర్శిపై అభిషేక్ మొహంతి ట్రైబ్యునల్ లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ తీరుపై ఇటీవల ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, మంగళవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని సీఎస్ను ఆదేశించింది.
ఈ క్రమంలో క్యాట్ విచారణ నిలిపివేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. అభిషేక్ మొహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నించడంతోపాటు క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని స్పష్టం చేసింది. కాగా, మంగళవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ జీవో జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ సోమేశ్ కుమార్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. దీంతో అభిషేక్ మొహంతికి ఊరట లభించింది.












Click it and Unblock the Notifications