నెలరోజుల్లో 3హత్యలు: వరంగల్లో హత్యల సంస్కృతి పెరుగుతోందా?
హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య చోటు చేసుకున్నాయి.
వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలో గత కొన్నిరోజులుగా చోటు చేసుకున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. హత్యల సంస్కృతి పెచ్చరిల్లుతుండటంపై ప్రజలను భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తోంది.
వరుసగా చోటు చేసుకున్న మూడు హత్యలు పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగినవే కావడం గమనార్హం. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య చోటు చేసుకున్నాయి.

ఇందులో మిల్స్ కాలనీలో జరిగిన అనిశెట్టి మురళి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకప్పుడు విప్లవ రాజకీయాలకే కేంద్రంగా ఉన్న కుమార్ పల్లి ఇప్పుడు రౌడీయిజంలో ముందుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇక మరో ఘటనలో ఓ బాలుడిని హత్య చేసి ఆటోలో పడేసిన ఉదంతం స్థానికులను కలవరపెట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులకే రిటైర్డ్ ఉద్యోగి సాంబయ్యను అల్లుడే నడిరోడ్డుపై హత్య చేయడంతో.. హత్యా సంస్కృతి పెరిగిపోతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ మూడు హత్యలు గత 30రోజుల్లోనే చోటు చేసుకోవడమే గమనార్హం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన నేరాలు.. మళ్లీ ఉనికి చాటుకుంటున్నాయా? అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన రెండు హత్యల్లోనే నిందితులు కారంపొడి ఉపయోగించడం గమనార్హం. కార్పోరేటర్ అనిశెట్టి మురళి హత్యలోను, రిటైర్డ్ ఉద్యోగి సాంబయ్య హత్యలోను ఇదే జరిగింది. నిందితులు తొలుత వారిపై కారంపొడి చల్లి ఆ తర్వాత విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు.
వరుస హత్యలతో అప్రమత్తమైన పోలీసులు వరంగల్ పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications