హైదరాబాదులో విధ్వంసానికి ఐఎస్ కుట్ర: ఈజీ సాఫ్ట్వేర్, చిల్లర ఫోన్లు
హైదరాబాద్: తమ సమాచారం పోలీసులకు చిక్కకుండా ఐఎస్ఐస్ అనుమానితులు హైదరాబాదులో చాలా పకడ్బందీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వారు ఆపరేట్ చేసిన తీరు తెలుసుకున్న తర్వాత పోలీసులకే దిమ్మతిరిగిందని అంటున్నారు. తమ వ్యవహారాలు ఏ మాత్రం బయటకు పొక్కకుండా, ఎవరూ ఛేదించకుండా చాలా తెలివిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ స్థానిక పోలీసులు ఏ మాత్రం పసిగట్టని రీతిలో ఇబ్రహీం పకడ్బందీగా చాలా తెలివిగా వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. పెద్ద నెట్ వర్క్ ఏమీ లేకుండానే అతను భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మార్కెట్లో లభించే ఊరూపేరు లేని కంపెనీల చిల్లర ఫోన్లను ఉగ్రవాదులు వాడినట్లు చెబుతున్నారు.
పోలీసులు పసిగట్టకుండా, వారి నిఘాకు చిక్కకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకుని విధ్వంసకాండకు పథకం వేసుకున్నట్లు చెబుతున్నారు. అందుకే వారి ఫోన్లు ట్యాప్ చేయడం, ఫోన్ల ఐడీలను పట్టుకోవడం స్థానిక పోలీసులకు సాధ్యం కాలేదని సమాచారం.
ఐడీ నెంబర్లు కనిపించకుండా ఉండే సాఫ్ట్వేర్ను ఉగ్రవాదులు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇంటర్నెట్లో కూడా ఉగ్రవాద సమాచారం ఓ ప్లాన్ ప్రకారం బదిలీ అయినట్లు జాతీయ భద్రతా సంస్థ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఐసిస్ బాస్కు, ఇబ్రహింకు మధ్య ఓ సోషల్ నెట్వర్క్ సైట్ ద్వారానే సంభాషణలు సాగాయని తెలుస్తోంది.. స్కైప్లో ప్రత్యేకంగా ఓ డ్రాఫ్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసి కీలక సమాచారాలు చేరవేసుకున్నట్లు చెబుతున్నారు.
మీడియా వచ్చిన కథనాల ప్రకారం - ఇబ్రహిం తన ప్లాన్ను సినీఫక్కీలో అమలు చేశాడు. హైదరాబాద్ పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాకుండా, వారికి అంతు చిక్కకుండా జాగ్రత్త పడుతూనే మరోవైపు ఇతర రాష్ట్రాల్లో రోజుల తరబడి మకాం వేశాడు. తన అనుచరులను నాందేడ్, అజ్మీర్ దర్గా వద్దకు పిలిపించుకుని కుట్రకు పథక రచన చేశాడు.
ఇబ్రహిం ముఠా వద్ద 40 సెల్ఫోన్లు, 32 సిమ్కార్డులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని సిమ్కార్డులు మహారాష్ట్ర, రాజస్థాన్లో కొన్నట్లు స్పష్టమైంది. ఇతర రాష్ట్రాల్లో కొన్న సిమ్కార్డులు, చవకఫోన్లు, లోకల్ సాఫ్ట్వేర్ పేరుతో పోలీసులకు చిక్కకుండా వ్వవహారం గుట్టుగా సాగిస్తూ వచ్చారు.