ఇవాంకా ఎఫెక్ట్: మొన్న బిచ్చగాళ్లు, నిన్న కుక్కలు, నేడు వీధి వ్యాపారులు!
మొన్నేమో కనిపించిన బిచ్చగాడిని కనిపించినట్లు పోలీసులు జైలుకు తరలించారు. నిన్నేమో జీహెచ్ఎంసీ సిబ్బంది వీధికుక్కలకు విషమిచ్చి చంపుతున్నారనే వార్తలు. ఇప్పుడేమో వీధి వ్యాపారులపై ప్రతాపం చూపిస్తున్నారు.
హైదరాబాద్: మొన్నేమో కనిపించిన బిచ్చగాడిని కనిపించినట్లు పోలీసులు జైలుకు తరలించారు. నిన్నేమో జీహెచ్ఎంసీ సిబ్బంది వీధికుక్కలకు విషమిచ్చి చంపుతున్నారనే వార్తలు. ఇప్పుడేమో వీధి వ్యాపారులపై ప్రతాపం చూపిస్తున్నారు.
Recommended Video
ఘోరం: ఇవాంకా వస్తోందని.. వీధి కుక్కలకు విషమిచ్చి..., ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్
మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన భాగ్యనగర వాసుల్లో చాలామందికి సంతోషం కలిగిస్తుంటే మరికొందరికి దు:ఖదాయకంగా మారింది.
పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?
రోడ్డున పడ్డ వీధి వ్యాపారులు...
భాగ్యనగరంలో జరగనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్(జీఈఎస్) నగరంలోని వీధి వ్యాపారుల పాటిట శాపంగా మారింది. ఈ సదస్సు ఏర్పాట్ల కారణంగా.. ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకుంటున్న వారు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. ఒకవైపు సదస్సు, మరోవైపు మెట్రోరైలు ప్రారంభోత్సవం కూడా తోడవడంతో నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా పాన్ డబ్బాలు, టీ స్టాళ్లు వగైరా వ్యాపారాలు పెట్టుకుని బతుకుతున్న చిరువ్యాపారులపై జీహెచ్ఎంసీ అధికారులు తమ ప్రతాపం చూపించారు. దీంతో నెల రోజులుగా వ్యాపారాలు లేక, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇరవై ఏళ్ల ఆధారం.. ఒక్కరోజులో...
మియాపూర్ మెట్రో, హైటెక్సిటీ, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, రహేజ ఐటీపార్కు, సైబర్టవర్, హెచ్ఐసీసీ ప్రధాన రహదారి, కొత్తగూడ, కొండాపూర్, మియాపూర్, బొల్లారంచౌరస్తా, హైదర్నగర్ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లకు ఇరువైపులా వీధి వ్యాపారులు 20 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. దాదాపు 1250 మంది వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా గుడిసెలు వేసుకుని డేరాల్లోనే నివసిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జీఈఎస్ సదస్సు జరుగుతుండడం, దీనికి ఇవాంకా ట్రంప్ వస్తుండడం, మరోవైపు మెట్రోరైలు ప్రారంభోత్సవం కూడా జరగనుండడం.. వీటన్నింటి ప్రభావం ఈ చిరువ్యాపారులపై పడింది. కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపించకుండా తమ వ్యాపారాలను అధికారులు ఖాళీ చేయించడంపై వీధి వ్యాపారులు మండిపడుతున్నారు.
నిలువ నీడ లేకుండా చేశారు...
వ్యాపారం మాత్రమే కాదు.. ఆ చిరు వ్యాపారుల నిలువ నీడకూ ఫుట్పాత్లే దిక్కుగా ఉంటున్నాయి. ఇలాంటి వారి కష్టాలైతే చెప్పనలవి కాదు. నెలరోజులుగా పూటగడిచేందుకు అప్పులు చేసి పొట్టపోసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘రోడ్డుపక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న మమ్ముల్ని ఉన్నపళంగా ఖాళీ చేయించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం ఇలా చేయడం అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం.. చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునే విధంగా స్థలం కేటాయించి న్యాయం చేయాలి..'' అని మాదాపూర్ లో రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకునే అచ్చయ్య వాపోయాడు. ‘‘నేను తోపుడు బండిపై టీ, తినుబండారాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అధికారుల చర్యతో ఉపాధి కాస్తా పోయింది.. నేనెలా బతకాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి..'' అని రాజు అనే వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు.
బిచ్చగాళ్ల సమాచారమిస్తే.. రూ.500 నజరానా
జీఈఎస్ సదస్సు నేపథ్యంలో బిచ్చగాళ్ల ఏరివేత కార్యక్రమానికి జీహెచ్ఎంసీ, పోలీసు శాఖతో పాటు జైళ్ల శాఖ నడుం బిగించిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోనే దాదాపు వెయ్యి మందిని పట్టుకుని వారి నివాసాలకు, మరి కొంతమందిని జైళ్లకు తరలించారు. ఈ అకస్మిక దాడులకు భయపడిన బిచ్చగాళ్లు చెట్టుకొకరు.. పుట్టకొకరు చెదిరిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు కానీ డిసెంబర్ నుంచి మళ్లీ బిచ్చగాళ్ల ఏరివేతకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. ఈ మేరకు జైళ్ల శాఖ నుంచి తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినా డిసెంబర్ 1నుంచి యాచకులను పట్టుకుని జైళ్లకు తరలించే కార్యక్రమాన్ని తిరిగి అమలు చేస్తామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రకటించారు. డిసెంబర్ 20 నాటికి బెగ్గర్ ఫ్రీ సిటీగా మారుస్తామని, ఇవాంక పర్యటన ముగిశాక వారికి పునరావాసం కల్పిస్తామని జైళ్ల శాఖ డీజీ తెలిపారు. అంతేకాదు, డిసెంబర్ 25 తర్వాత బిచ్చగాళ్ల సమాచారం ఇచ్చిన వారికి రూ.500 నజరానా కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.