జగ్గారెడ్డి కారెక్కేస్తారా?.. గాంధీభవన్ లో ఉంటారా?.. మే 25 తర్వాత ఆ ట్విస్టేంటో..!
Recommended Video
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ లో ఆయన కూడా చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకు ఆయన కాంగ్రెస్ లో ఉంటారా?.. పార్టీ వీడి కారెక్కుతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ లోకి వస్తే బాగుంటుందంటూ.. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ బంధువుల నుంచి తనకు ఆహ్వానం ఉందని బాంబ్ పేల్చడం చర్చానీయాంశమైంది. అదలావుంటే కేంద్రంలో యూపీఏ సర్కార్ వస్తేనే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం వెనుక మర్మమేంటి. లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన మూడ్ మారుతుందా?.. లేదంటే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారా? అనేది రానున్న కాలమే సమాధానం చెప్పాలి.

కారెక్కుతారా?.. లేదా?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి కూడా కారెక్కేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మధ్యన గులాబీవనంలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు.
సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు మార్చి రెండవ వారంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ చేరడం ఖాయమనే వార్తలొచ్చాయి. ఎవరికి అందుబాటులో లేకుండా.. జగ్గారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఆయన సెల్ఫోన్ కు కాల్ చేస్తే స్విచ్చాఫ్ అని బదులు రావడం కూడా ఊతమిచ్చినట్లైంది. కానీ ఆయన టీఆర్ఎస్ గూటికి చేరకపోవడంతో అదంతా అవాస్తమని తేలిపోయింది.

30లోపు తేలుస్తా..!
జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన కాంగ్రెస్ లో ఉంటారా?.. లేదంటే టీఆర్ఎస్ లోకి వెళ్తారా? అనే విషయాన్ని లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముడిపెట్టడం విస్మయం కలిగిస్తోంది. తెలంగాణ భవన్లో ఉంటానో, గాంధీభవన్లో ఉంటానో మే 25వ తేదీ నుంచి 30లోపు కాలమే నిర్ణయిస్తుందనే నర్మగర్భ వ్యాఖ్యలు దేనికి సంకేతమనే టాక్ నడుస్తోంది. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ బంధువులు తనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఒకవేళ మే 30వ తేదీ లోపు కేసీఆర్ గానీ, కేటీఆర్ తరపు బంధువులు గానీ తనను మళ్లీ కలిస్తే నిర్ణయం చెబుతానంటూ వ్యాఖ్యానించారు. అదలావుంటే టీఆర్ఎస్ లోకి తనకు తానుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు.

నేను ఏడున్నా అంతే..!
అదలావుంటే పార్టీ జెండాపై గెలిచిన నేతను కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు. స్వశక్తితో ఎదిగిన నేతను అంటూ చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో కొనసాగినా అధిష్టానం మాట సగం మాత్రమే వింటానని.. మిగతాదంతా తన నిర్ణయాలే ఉంటాయని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించడం కారణంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బాగా దెబ్బతిందని.. విభజన వల్ల తెలంగాణ ప్రజలకు ఎంతమేర లాభం జరిగిందో మాత్రం తనకు తెలియదన్నారు.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క సంగారెడ్డి సెగ్మెంట్ తప్ప టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చేసింది. అయితే ఆ ఒక్క సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కారెక్కిస్తే.. సీఎం కేసీఆర్ ఇలాకా మెదక్ జిల్లాలో గులాబీ వనానికి తిరుగు ఉండదనేది టీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తుందంటారు కొందరు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కుతున్న తరుణంలో.. జగ్గారెడ్డికి కూడా గులాబీ తీర్థం పోస్తే బాగుంటుందనేది టీఆర్ఎస్ ఇంటర్నల్ చర్చగా తెలుస్తోంది. ఆ మేరకు జగ్గారెడ్డిని చేర్చుకోవాలంటూ అధిష్టానానికి కొందరు నేతలు సూచిస్తున్నారట.

జగ్గారెడ్డి Vs చింతా..! మరి కారులో సీటు దొరికేనా?
పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే సీఎం కేసీఆర్ కు గుడి కట్టిస్తానంటూ.. ఆ మధ్య జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ క్రమంలో ఆయన కచ్చితంగా టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వాదనలు జోరందుకున్నాయి. అందుకే కేసీఆర్ కు గుడి కట్టిస్తానంటూ వ్యాఖ్యలు చేశారనే టాక్ నడిచింది. కానీ జగ్గారెడ్డి తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూసింది లేదు, ఆ పార్టీలో చేరింది లేదు.
ఇక సంగారెడ్డి సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన చింతా ప్రభాకర్ కు.. జగ్గారెడ్డి పార్టీలోకి రావడం ఇష్టం లేదట. ఆయన టీఆర్ఎస్ లోకి వస్తే స్థానికంగా పరిస్థితులు తారుమారు అవుతాయనేది చింతా వర్గీయుల మాట. ఆ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బలమైన వాదనలు వినిపించారట.
అదలావుంటే జగ్గారెడ్డి గతంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో అక్కడ వాలిపోయారు. ఏది ఏమైనా, ఏ పార్టీలో ఉన్నా సగం నిర్ణయాలు సొంతంగా తీసుకుంటానని చెబుతున్న జగ్గారెడ్డి.. మరి టీఆర్ఎస్ లోకి వస్తే ఇమడగలుగుతారా అనేది ప్రశ్నార్థకమే. అదలావుంటే పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ లో పదవుల పందేరం మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అప్పటిదాకా జగ్గారెడ్డి చేరికను పెండింగులో పెట్టాలనేది టీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచనట. మొత్తానికి తాజాగా జగ్గారెడ్డి చేసిన నర్మగర్భ వ్యాఖ్యలతో.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడబోరనేది కొందరి వాదన.












Click it and Unblock the Notifications