"సోనియా తలుచుకుంటే.. కేసీఆర్ ఎంతటోడు?"
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై సొంత పార్టీలోనే అసంత్రుప్తులున్నాయన్నది జగమెరిగిన సత్యం. ప్రతిపక్షంలో ఉండి మరీ.. ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తారనే ఆరోపణ ఆయనపై పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. అయితే ఈ ఆరోపణలకు చెక్ పెట్టడానికా! అన్నట్లు.. సీఎం కేసీఆర్ పై తొలిసారిగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు జానారెడ్డి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి. తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తుకు చేస్తూ.. 'అప్పట్లో సోనియా గాంధీ తలుచుకుంటే కేసీఆర్ ఏపాటి అని, కేసీఆర్ ఉద్యమం పాకిస్థాన్తో చేసిన యుద్ధం కంటే ఎక్కువేమీ కాదని' ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మనోభావాలను అర్థం చేసుకున్నారు కాబట్టే.. సోనియా తెలంగాణ ఇచ్చారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి జాడ మచ్చుకు కూడా కనిపించడంలేదని మండిపడ్డ జానారెడ్డి.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా.. రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్ కు తిరుగులేదంటూ చెబుతోన్న సర్వేల గురించి ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్ అంత బలోపేతంగా ఉన్నప్పుడు ఇతర పార్టీ నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారంటూ ప్రశ్నించారు జానారెడ్డి.
గత ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామి ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీసిన జానారెడ్డి.. సర్వేల పేరుతో టీఆర్ఎస్ జనాలను మభ్య పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, కేసీఆర్ పై ఇంత ఘాటుగా జానారెడ్డి వ్యాఖ్యలు చేయడం పట్ల పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.