జనసేన లోకి 'కొండా', రాజాసింగ్ చేరిక పై పార్టీ కీలక ప్రకటన..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ చుట్టూ ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. క్రమశిక్షణా సంఘం సురేఖ పైన వేటు వేయాలంటూ సిఫారసు చేయటంతో.. ఇక సురేఖ పైన చర్యలు ఖాయమని భావిస్తున్నారు. ఇదే సమయంలో సురేఖ తన కుమార్తెతో సహా జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దీని పైన పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది.
తెలంగాణలో ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం సంచలనంగా మారుతోంది. పార్టీ హైకమాండ్ సురేఖ పైన తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత జనసేనలో చేరుతారని.. ఆ తరువాత సురేఖ సైతం ఆ పార్టీ వైపే చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కాగా, తాజాగా డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కొండా మురళీ తాము కాంగ్రెస్ వీడటం లేదని వెల్లడించారు. హైకమాండ్ నిర్ణయం తరువాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సురేఖ సమాయత్తం అవుతున్నారు. ఈ సమయంలోనే తెలంగాణ జనసేన ఇంఛార్జ్ శంకర్ గౌడ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కొండా తమ పార్టీలో చేరిక పైన స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తేల్చి చెప్పిన జనసేన
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితతో పాటు కొండా మురళి, కొండా సురేఖ జనసేనలోకి వస్తే వారిని సాదరంగా ఆహ్వానిస్తామని పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం పార్టీలోకి వస్తే వరంగల్ ప్రాంతంలో జనసేన మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా జనసేనాని పవన్ కల్యాణ్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని శంకర్ గౌడ్ వెల్లడించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు, యువత, మేధావులు కూడా తమతో టచ్లో ఉన్నారని ఆయన తెలిపారు. త్వరలో జరిగే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన సత్తా ఏంటో చూపిస్తుందని శంకర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో.. ఇప్పుడు కొండా నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications