కవిత భాష బాగా లేదు, అక్కుసుతోనే: జీవన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడే భాష సరిగా లేదని, అక్కసుతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ శాసనసభ్యుడు టి. జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్త చేశారు. మంగళవారం సీఎల్పీలో ఎర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో హెచ్చరింపు ధోరణి సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ సొత్తు కాదని, తాను కూడా రెండు రోజులు జైలుకు వెళ్లాలని జీవన్ రెడ్డి అన్నారు. అధికారం శాశ్వతమనుకునే వారికి ఢిల్లీ ఎన్నికలే కనువిప్పు అని అన్నారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గుణపాఠం చెప్పాయని మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. మాటలకే పరిమితమైన బీజేపీ ప్రజలు తగిన బుద్ది చెప్పారని అన్నారు. మంగళవారం ఢిల్లీ ఎన్నికల అంశమై ఆయన మీడియాతో మాట్లాడారు. రోజుకు పది డ్రెస్సులు మార్చే ప్రధాని నరేంద్ర మోడీకి ఢిల్లీ ఫలితాలు చెంపపెట్టు అన్నారు.
నియంతృత్వ విధానాలు చెల్లవని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గమనించాలని సూచించారు. అదేవిధంగా కేసీఆర్ దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తున్నారని, వాటిని నియంత్రించుకోవాలని పొన్నం హితవు చెప్పారు. కాంగ్రెస్ బలపడాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాహుల్కు తోడుగా ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని పొన్నం ఆకాంక్షించారు.