తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం
తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం నాల్గవ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాజ్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొత్త గవర్నర్తో ప్రమాణం స్వీకారం చేయించారు.
ఈ వేడుకకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల బృందం, సీఎస్ శాంతి కుమారి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా అధికార, విపక్ష నాయకులు హాజరయ్యారు. తెలంగాణ నూతన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణు దేవ్ వర్మకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు.

త్రిపురలో 1957 ఆగస్టు 15న జన్మించారు జిష్ణుదేవ్ వర్మ. త్రిపుర రెండో డిప్యూటీ సీఎంగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ గతంలో సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి.
రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా రావడం విశేషం.
రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తా: గవర్నర్
తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజానీకానికి తన సందేశాన్ని అందించారు. తనకు రాష్ట్ర గవర్నర్గా అవకాశం కల్పించిన భారత రాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. త్రిపుర నుంచి వచ్చిన తాను.. గొప్ప సంస్కృతి, సుసంపన్నమైన వారసత్వ సంపద, సారవంతమైన నేలలతో దేశ నడిబొడ్డున ఉన్న తెలంగాణకు సేవ చేయడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. వ్యాపారాలకు కూడా కేంద్ర బిందువుగా మారిందన్నారు. రాష్ట్రంలో యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మంచి మంత్రివర్గం ఉందని, వారితో కలిసి రాష్ట్ర అభ్యున్నతికి పాటుపడుతానని స్పష్టం చేశారు. సుస్థిర ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అంశాల్లో తెలంగాణను అగ్రగామిగా ఉంచేందుకు అందరితో కలిసి పనిచేస్తానన్నారు గవర్నర్.












Click it and Unblock the Notifications