ఒత్తిడి: రెండుచోట్ల కేసీఆర్ పోటీ, విజయవాడ లోకసభ నుంచి చంద్రబాబు?
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), కేసీఆర్ (తెలంగాణ)లు వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పటికీ అది ఇంకా సస్పెన్స్గానే ఉంది. కేసీఆర్ సహా తెలంగాణలోని విపక్షాలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ముందస్తుపై సై అంటే సై అంటున్నాయి. ఏపీలో సీఎం చంద్రబాబు మాత్రం లోకసభ ముందస్తుకు ఓకే కానీ, అసెంబ్లీ ముందస్తుకు నో అంటున్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు కీలక నిర్ణయం, వారికి షాకిస్తారా?
ఈ విషయాన్ని పక్కన పెడితే, ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇరువురు సీఎంలు కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు అదే ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేతలు తమ కొడుకులకు ముఖ్యమంత్రి పదవులు అప్పగించి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని వారి వారి పార్టీల్లో పలువురు కోరుకుంటున్నారు.
కొడుకులకు సీఎం పదవి అప్పగించి
టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, టీజీ వెంకటేష్ తదితరులు పలుమార్లు బాహాటంగానే మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నది చాలని, ఆయన లాంటి అనుభవజ్ఞులు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, తనయుడు నారా లోకేష్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని వ్యాఖ్యానించారు. కేటీఆర్కు సీఎం పదవి అప్పగించి కేసీఆర్ కూడా ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించాలని తెరాసలో వారు కూడా అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు. 2019లో వారు జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని కోరుకుంటున్నారు.
Recommended Video
రెండు చోట్ల.. అసెంబ్లీ, లోకసభకు కేసీఆర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, కేసీఆర్ ధీమాగా ఉన్నారు. కేసీఆర్ మరోసారి గజ్వెల్ నుంచి పోటీ చేసే అవకాశముంది. దాంతో పాటు మెదక్ పార్లమెంటు నుంచి కూడా పోటీ చేయవచ్చునని చెబుతున్నారు. మెదక్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేత లేరని, కాబట్టి ఇక్కడ కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు. కేసీఆర్ గత ఎన్నికల్లోను అసెంబ్లీ, లోకసభలకు పోటీ చేశారు. ఆ తర్వాత లోకసభకు రాజీనామా చేశారు.
విజయవాడ నుంచి బరిలో చంద్రబాబు?
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న విజయవాడ లోకసభ నుంచి పోటీ చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానాన్ని తనయుడు లోకేష్కు అప్పగించి, అదే విజయవాడ లోకసభ నియోజవకవర్గంలోని ఓ అసెంబ్లీ నియోజవకర్గం నుంచి చంద్రబాబు పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
చంద్రబాబు లోకసభకు పోటీ చేయకుంటే?
చంద్రబాబు కేవలం అసెంబ్లీకి పోటీ చేసి లోకసభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ.. ఢిల్లీలో చక్రం తిప్పాలనే ఆలోచన ఉంటే ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీలు ఢిల్లీని ఏలాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. జాతీయ పార్టీలు మోసం చేశాయని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అక్కడ చక్రం తిప్పాలంటే వీరు కూడా ఢిల్లీలో ఉండాలి. దానికి తోడు ఏపీలో లోకేష్కు, తెలంగాణలో కేటీఆర్కు సీఎం పదవి అప్పగించాలని వారి వారి పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు కూడా వస్తున్నాయని అంటున్నారు.