కాంగ్రెస్ బాటలోనే టీఆర్ఎస్, మా వైపే చూపు: తేల్చేసిన లక్ష్మణ్
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజలు ఇంకా కాంగ్రెస్ అవినీతిని మరిచిపోలేదన్నారు.
న్యూఢిల్లీ: టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజలు ఇంకా కాంగ్రెస్ అవినీతిని మరిచిపోలేదన్నారు. కాంగ్రెస్లా టీఆర్ఎస్ కూడా అవినీతి, కుటుంబ పాలన, బంధుప్రీతి పార్టీగా మారిపోయిందని ఘాటుగా విమర్శించారు.
అధికార పార్టీ వైఖరితో ఆత్మహత్యలు
ఆయూబ్ఖాన్, శ్రీనివాస్ లాంటి వ్యక్తులు అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. నాడు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారని.. నేడు తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేయడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లక్ష్మణ్ తెలిపారు.
తమ పోరాటం ఆగదు.. మా వైపే చూస్తున్నారు..
టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగబోదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనేక మంది బీజేపీ వైపు చూస్తున్నారని, పార్టీలో చేరికలు నిరంతరం ఉంటాయని తెలిపారు.
ఆహ్లాదంగా ఢిల్లీ సమావేశాలు..
అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో రాంలాల్, 14, 15 తేదీల్లో రాంమాధవ్, 23న సావ్దాన్సింగ్ రాష్ట్ర పర్యటన ఉంటుందని చెప్పారు. అక్టోబర్ మూడో వారంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలుంటాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆహ్లాదకర వాతావరణంలో సాగాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు.
అధికారం మాదే..
దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మరింతగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఆదేశించారని తెలిపారు. రాబోయే గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో గెలవని స్థానాలు గెలిచి చరిత్ర సృష్టిస్తామని అన్నారు. కర్ణాటక, ఒడిశా, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కే లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు.