కరుణించిన కవిత..! 68మంది తెలంగాణ యువతులను స్వస్థలాలకు తరలింపు..!!
హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన అభాగ్యులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు తమవంతు సహకారాలను అందిస్తున్నారు. వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు చేర్చే క్రమంలో ప్రభుత్వాలు శ్రమింస్తుంటే, వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని మరికొంత మంది నేతలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కోవలో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవతో అరవై ఎనిమిది మంది తెలంగాణ యువతకు సాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
మాజీ ఎంపీ కవిత చొరవ.. సోలాపూర్ లో చిక్కుకుపోయిన మహిళలకు సహాయం..
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించిన కల్వకుంట్ల కవిత తాజాగా కరోనా క్లిష్టసమయంలో వార్తల్లో నిలిచారు. అదికూడా రాష్ట్రం కాని రాష్ట్రంలో పడరాని కష్టాలు పడుతూ అగమ్యగోచర పరిస్థితిలో ఉన్న మహిళలకు సహాయం చేసారు కవిత. సహాయం చేయడం వేరు వాస్తవంగా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం వేరు. కవిత చేసింది ఇప్పడు ఇదే. కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యలో ఇతర రాష్ట్రాల్లో అనేక మంది చిక్కుకుపోయి అనేక బాదలు పడుతున్నట్టు తెలుస్తోంది. అలా చిక్కుకుపోయిన సుమారు 68మంది మహిళలను మాజీ ఎంపి కవిత కాపాడిన ఉదంతం పట్ల చర్చ జరుగుతోంది.
కవితకు ట్వీట్ చేసిన మహిళలు.. 68 మంది మహిళలను స్వస్థలాలకు తరలింపు..
ఇన్ని రోజులుగా సోలాపూర్లో ఇబ్బందులు పడ్డ యువత ట్విట్టర్ ద్వారా కవితకు తమ దీన గాధను తెలుపుకున్నారు. దానికి స్పందించిన కవిత వారికి తగిన ఏర్పాట్లు చేసి, సహాయ సహకరాలు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్ లో చిక్కుకున్న అరవై ఎనిమిది మంది తెలంగాణ యువతులు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో వారి స్వస్థలాలకు చేరుకున్నారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలకు చెందిన అరవై ఎనిమిదిమంది యువతులు లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్ లో చిక్కుకుపోయారు. వారికి ఆపన్న హస్తం అందించారు కల్వకుంట్ల కవిత.
సమయస్పూర్తిగా వ్యవహరించిన కవిత.. హుటాహుటిన మహిళల తరలింపు..
చిక్కుకు పోయిన యువతులందరినీ అక్కడి ఒక ప్రైవేటు కాలేజీలో వసతి ఏర్పాటు చేశారు. అయితే 23 రోజులుగా ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ఉండటం, కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో యువతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే , యువతి కుటుంబ సభ్యుల్లో ఒకరు, వారి సమస్యలను ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవితకు వివరించి, సహాయం చేయాల్సిందిగా కోరారు. దానిపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ కవిత, యువతులు తెలంగాణ కు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
కవిత స్పందనకు ధన్యవాదాలు.. కవితను మెచ్చుకుంటున్న మహిళల తల్లిదండ్రులు..
మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించిన మాజీ ఎంపీ కవిత, బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అరవై ఎనిమిది మంది యువతులు బుధవారం వారి స్వస్థలాలకు చేర్చారు. యువతులను క్వారంటైన్ లో ఉంచేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. కోరిన వెంటనే స్పందించి, స్వస్థలాలకు చేరుకునేలా సహాయం చేసిన మాజీ ఎంపీ కవిత కు యువతులు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సంఘటన పట్ల కవితతో పాటు ఆమె సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సమయస్పూర్తిగా వ్యవహరిస్తున్నారని, అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు బాదిత కుటుంబ సభ్యులు.