అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది: కవిత
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు.. అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు.. అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సులో కవిత పాల్గొననున్నారు.
మహిళా సాధికారతపై జరుగుతున్న ఈ సదస్సుకు 12 వేల మంది ప్రతినిధులు, దేశ విదేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో మహిళా సాధికారతలో సామాజిక రాజకీయ మార్పులు అనే అంశంపై ఎంపీ కవిత ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, మనుషుల మధ్య సంబంధాలు వేరని పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళల పాత్ర.. చట్టసభల్లో రిజర్వేషన్ ఎలా ఉండాలనే అంశాలపై చర్చిస్తామన్నారు.
సదస్సులో కొన్ని మంచి నిర్ణయాలు వస్తాయని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో కొన్ని మంచి నిర్ణయాలు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షానికి అపాయింట్మెంట్ ఇచ్చి రద్దు చేయడం సరికాదన్నారు. కాగా, ఈ పార్లమెంటేరియన్ సమావేశంలో కవితతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కోడలు బ్రహ్మణి, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి కుమార్తె ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వక్తలుగా పాల్గొననున్నారు.
మహిళా పార్లమెంట్ సదస్సుకు దేశ వ్యాప్తంగా 401 మంది మహిళా శాసనసభ్యులు, 91 మంది మహిళా ఎంపీలు, దేశ విదేశాల్లోని సోషల్ అండ్ కార్పొరేట్ రంగానికి చెందిన 300 మంది మహిళా ప్రముఖులు సదస్సుకు హాజరుకానున్నారు. వీరితో పాటు 10 వేల మంది విద్యార్థినులు సదస్సులో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్ ద్వారా ఢిల్లీ నుంచి సదస్సును ప్రారంభించనున్నారు.