Kanakai Waterfalls: 'తెలంగాణ స్విట్జర్లాండ్' చూసి తీరాల్సిందే..
అడవుల అందాల మధ్య దాగి ఉన్న ఈ జలపాతం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. తెలంగాణ స్విట్జర్లాండ్ గా పిలువబడుతున్న ఈ జలపాతం అందాలను చూడాలంటే ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే. ఆదిలాబాద్ అడవుల మధ్య ఈ జలపాతం దాగి ఉంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్ మండలం గిర్నూర్ గ్రామ శివార్లలో కడెం నదిపై సహజంగా ఈ వాటర్ ఫాల్స్ ఏర్పడ్డాయి. శీతాకాలంలో ఆదిలాబాద్ అడవులు 'తెలంగాణ స్విట్జర్లాండ్' ను తలపిస్తాయి. ఆ అడవుల్లో దాగి ఉన్న ఈ జలపాతాన్ని సందర్శించే క్రమంలో టూరిస్టులు గొప్ప అనుభూతికి లోనవుతారు. ఇక్కడ నీరు దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి 100 అడుగుల వెడల్పుతో పెద్ద కొలనులోకి దుంకుతుంది.
ఈ జలపాతాన్ని కనకాయి జలపాతం లేదా కనకదుర్గ వాటర్ ఫాల్స్ అని అంటారు. ఈ జలపాతం చుట్టపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించేవాళ్లు. అలా ఈ జలపాతానికి ఆ పేరు వచ్చింది. వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల పచ్చని పచ్చిక బయళ్లు.. దట్టమైన అడవి.. కొండలూ ఇవన్నీ కలిపి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని 'తెలంగాణ స్విట్జర్లాండ్' అని పిలుచుకుంటారు. ఇటీవలికాలంలో కొందరు ఔత్సాహికులు సామాజికమాధ్యమాల్లో ఈ జలపాతం అందాలను వైరల్ చేయడంతో పర్యటకుల తాకిడి పెరిగింది.

హైదరాబాద్ లాంటి సిటీలో బిజీబిజీగా గడిపే టెకీలు, ఇతర ఉద్యోగులు వారాంతంలో ఈ ప్రాంతానికి వస్తే అన్నీ మరచిపోతారు. ఇక్కడి పక్షుల రాగాలు మనల్ని మైమరపింపజేస్తాయి. ఆదిలాబాద్ అడవుల మధ్య కడెం నది అందాలు చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ ప్రదేశం ఆదిలాబాద్ నుంచి 35 కి. మీ. దూరంలో అలాగే నిర్మల్ నుంచి 54 కి. మీ. దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి ఈ జలపాతం 272 కి. మీ. ఉంటుంది. వారాంతంలో ఉదయం వెళ్లి సాయంత్రం రావడానికి వీలుగా ఉంటుంది. అంతేకాక ఇక్కడ ట్రెక్కింగ్ వెసులుబాటు కూడా ఉంది. ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్నవారికి ఇది స్వర్గధామంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications