బీఆర్ఎస్ మరో షాక్?: బండి సంజయ్తో కరీంనగర్ మేయర్ భేటీ
కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కొందరు నేతలు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్తో కరీంనగర్ మేయర్ సునీల్ రావు భేటీ అయ్యారు. పలువురు కార్పొరేటర్లతో కలిసి ఓ హోటల్లో బండి సంజయ్తో సమావేశమయ్యారు.
అయితే, స్మార్ట్ సిటీ నిధుల కోసమే కలిశామని మేయర్, కార్పొరేటర్లు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే పలుమార్లు మేయర్ సునీల్ రావు.. బండి సంజయ్తో భేటీ కావడం గమనార్హం. కేంద్రమంత్రి అయిన తర్వాత బండి సంజయ్కి సోషల్ మీడియా వేదికగా మేయర్ సునీల్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సునీల్ రావు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

బండి సంజయ్ కేంద్రమంత్రి అయిన తర్వాత బండి సంజయ్ కరీంనగర్ కు రావడంతో మేయర్ సునీల్ రావు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సునీల్ రావు కొట్టిపారేశారు. మరోవైపు, బీజేపీ నేతలతో భేటీ కావడంపై బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగులతో చర్చిస్తా: బండి
కరీంనగర్కు నిధులు తెచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేటర్లు బండి సంజయ్ను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానన్నారు. కరీంనగర్ను అద్దంలా తీర్చిదిద్దుతానని తెలిపారు.
కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో చర్చిస్తానని బండి సంజయ్ చెప్పారు. స్మార్ట్ సిటీ పనులను మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని స్పష్టం చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications