చంద్రబాబు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీ భ్రష్టు పట్టింది : కవిత
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీ భ్రష్టు పట్టిపోయిందని ఆరోపించారు తెలంగాణ ఎంపీ కవిత. ఆనాడు 2002లో.. ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్లే ఫ్యాక్టరీ పరిస్థితి ఇలా తయారైందని మండిపడ్డారు.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిజాం షుగర్స్ ను ప్రైవేటు పరం చేసిన తర్వాత వరుసగా కొన్నేళ్లు ఫ్యాక్టరీ యాజమాన్యం నష్టాల లెక్కలే చూపించిందని, ఉత్పత్తి ఉన్నా ఫ్యాక్టరీ మాత్రం నష్టాల్లోనే ఉందంటూ లెక్కలు చూపించారని ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్స్ ను పునరుద్దరించడానికి సిద్దంగా ఉందని చెప్పిన కవిత.. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం వారసత్వ సంపదగా భావిస్తోందని తెలిపారు. ఫ్యాక్టరీ కోసం 2014 నుంచి ఇప్పటిదాకా రూ.66 కోట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించినట్లు స్పష్టం చేశారు కవిత.