తాలిబన్లా కెసిఆర్: షబ్బీర్, చేతులు విరగ్గొడుతారు: జీవన్ రెడ్డి
కరీంనగర్/ హైదరాబాద్: పురాతన కట్టడాలైన చార్మినార్, ఉస్మానియా ఆస్పత్రులను ప్రభుత్వం కూల్చివేస్తే ప్రజలు తిరగబడతారని, చేతులు విరగ్గొడతారని కాంగ్రెసు శాసనసభ్యుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఆదివారం ఆయన మాట్లాడారు.
ప్రపంచ దేశాల్లో పురాతన కట్టడాలను భావితరాలకు అందించాలనే ఆలోచనతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాటిని బాగు చేయిస్తుంటే తెలంగాణ సర్కార్ మాత్రం వాటిని కూలదోసే పనిలో పడిందని విమర్శించారు. చార్మినార్ను కూల్చి వేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ చేసిన వాఖ్యలను నిరసిస్తూ ఆదివారం కరీంనగర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను ఖననం చేశారు.
చారిత్రక చిహ్నాలను ధ్వంసం చేసే ఎజెండాతో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తాలిబన్లా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన సందర్భంలో కుతుబ్షాహీ వంశస్తులు నిర్మించిన సుందర కట్టడాలను కూల్చివేశారని, కానీ చార్మినార్ జోలికి వెళ్లలేదని ఓ ప్రకటనలో వివరించారు.

చార్మినార్ రెండో ఫ్లోర్లో మసీదు ఉన్నందునే ఔరంగజేబు దానిని ముట్టుకోలేదని తెలిపారు. దీని గురించి ఏమాత్రమూ అవగాహన లేని డిప్యూటీ సీఎం అలీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రసన్నం చేసుకోవడానికి చార్మినార్నూ కూల్చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాలిబన్లు, ఐసిస్ మిలిటెంట్లు కూడా ఆధిపత్యం కోసం తమ దేశాల్లోని కట్టడాలను కూల్చివేశారని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చారిత్రక కట్టడాల విషయంలో అలాగే వ్యవహరిస్తోందని, నియంతలా పని చేస్తోందని విమర్శించారు. ఈ భవనాన్ని పరిరక్షించే విషయమై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి, వారసత్వ భవనాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారని, ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా చూడాలని, లేకపోతే తర్వాత పశ్చాత్తాప్పడతారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి పాతభవనంపై ఇంజనీర్లు చేసిన సర్వే నివేదికను బహిర్గతం చేయాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించి నివేదిక అంశాలను వివరించాలని టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డిమాండ్ చేశారు.
పెద్ద పెద్ద గోడలతో నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రి కట్టుదిట్టంగా ఉందని, ఈ భవనంలో ఉంటే ఏసీలో ఉన్నంత చల్లగా ఉంటుందని కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. చిన్న చిన్న మరమ్మతులు ఉంటే సరిచేసుకోవచ్చని, ఆస్పత్రిని కూలుస్తామనడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. రేపటి తరాలకు మన చరిత్ర, వారసత్వ సంపదను అందించాలి తప్ప వాటిని నామరూపాలు లేకుండా చేయొద్దని లోక్సత్తా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు అన్నారు.












Click it and Unblock the Notifications