గజ్వెల్ అభివృద్ధి ఆగాలని హరీష్ ఆలోచన!: ఎందుకో చెప్పిన కేసీఆర్, 14న నిరాడంబరంగా నామినేషన్
గజ్వెల్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ఆదివారం ఎర్రవల్లిలో తన గజ్వెల్ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన పార్టీ తరఫున పోటీ చేయనున్న 107 మంది అభ్యర్థులతో (ప్రకటించిన అభ్యర్థులు) సమావేశమై వారికి తెలంగాణ భవన్లో బీ ఫారం ఇవ్వనున్నారు. ఇందుకు హెలికాప్టర్లో హైదరాబాద్ వస్తున్నారు
గజ్వెల్ కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ప్రజలతో సంబంధాలు ఆస్వాదించానని చెప్పారు. ఇప్పుడు తన పాత్ర మారిందని అన్నారు. గజ్వెల్ ప్రజలు చాలా గట్టి వారని చెప్పారు. గజ్వెల్లో కొంత అభివృద్ధి జరిగిందని, ఇంకా జరగాల్సి ఉందని చెప్పారు. తాను ఈ నెల 14న నామినేషన్ వేస్తానని, నిరాడంబరంగా వేస్తానని, ఎవరూ రావొద్దని చెప్పారు.
సిద్దిపేటకు పోటీ వస్తుందని గజ్వెల్ అభివృద్ధి ఆగిపోవాలని హరీష్ రావు
ఈ సందర్భంగా కేసీఆర్ నవ్వుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి (సిద్దిపేట) పోటీ వస్తుందని, ఇక్కడి (గజ్వెల్) అభివృద్ధి ఆగిపోవాలని హరీష్ రావు అనుకుంటున్నారని హాస్యంగా మాట్లాడారు. గజ్వెల్లో ఇల్లు లేని వారు ఉండకూడదని చెప్పారు. గజ్వెల్కు రైలు పరుగెత్తుకుంటూ రావాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు ప్రతి గంటకు రావాలన్నారు. కొండపోచమ్మ సాగర్ను వర్షాకాలంలో నింపుతామన్నారు.
75 శాతం పథకాలకు ఎర్రవల్లి ఫాంహౌస్లో రూపకల్పన
గజ్వెల్ ప్రజలు మూడు పంటలు పండించేస్థాయికి ఎదగాలని కేసీఆర్ అన్నారు. కంటి వెలుగు పథకానికి ఎర్రవల్లే కారణమని చెప్పారు. గజ్వెల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి పాడి గేదెలు ఇస్తామన్నారు. 75 శాతం పథకాలకు ఎర్రవల్లి ఫాంహౌస్లోనే రూపకల్పన జరిగిందని చెప్పారు.
మళ్లీ తెరాసను గెలిపిస్తారు, అనుమానం లేదు
గజ్వేల్ ప్రజలు తెరాసను మళ్లీ గెలిపిస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని కేసీఆర్ అన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతివ్యక్తీ సొంత ఇల్లు నిర్మించుకోవాలన్నారు. ప్రతిపల్లెకు తారు రోడ్డు వేస్తామని చెప్పారు. ప్రతి గుంటకు సాగునీరు అందిస్తామని చెప్పారు. తొలి దశలో చెరువులను నింపుతామన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో గజ్వేల్ నియోజకవర్గానికి తీసుకొస్తామన్నారు. పంట కాలనీలు కూడా మొదట గజ్వేల్లోనే రావాలన్నారు. ఎన్నికలు అయిన తర్వాత రెండేళ్లలో సొంతిల్లు లేని కుటుంబం లేకుండా చేస్తామని, గజ్వేల్లో ప్రతి ఇంటికీ వంద శాతం రాయితీతో రెండు పాడిపశువులు ఇస్తామన్నారు.
భారీ మెజార్టీతో కేసీఆర్ గెలుస్తున్నారు
గజ్వెల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు అన్నారు. కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. అభివృద్ధిలో గజ్వెల్ ఇరవై ఏళ్లు ముందుకు వెళ్లిందని చెప్పారు.