కెసిఆర్ జోష్: పెద్దల సభకు గ్యారంటీ, అభ్యర్థులెవరు?
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తన సత్తా చాటనుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇతర పార్టీల శాసనసభ్యులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా కెసిఆర్ రాజ్యసభ సీట్లకు కూడా గురిపెట్టనట్లు కనిపిస్తోంది.
దాంతో తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఫలితాల గురించి ఎవరికీ అనుమానం లేకుండా పోయింది. కానీ అభ్యర్థులు ఎవరూ అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం నుంచి రెండు స్థానాల భర్తీకి వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ టిఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమైంది. అయితే ఆ రెండు సీట్లూ ఎవరికి దక్కుతాయనేదే చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి తొలిసారిగా కె కేశవరావు రాజ్యసభ సభ్యత్వం పొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్తోపాటు వామపక్షాలు టిఆర్ఎస్కు మద్దతు ప్రకటించాయి. సాధారణ ఎన్నికల్లో వివిధ పార్టీలకు లభించిన స్థానాల ప్రకారం ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు అవకాశం ఉండేది.

ఎన్నికల తర్వాత టిడిపి ఖాళీ కావడం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు సభ్యులు టీఆర్ఎస్లో చేరడం, బిఎస్పి విలీనం కావడంతో రెండు స్థానాలను కూడా దక్కించుకోవడానికి అవసరమైన బలం టిఆర్ఎస్కు చేకూరింది. టిఆర్ఎస్కు ఇప్పుడు 84 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
విపక్షాలు కనీసం పోటీకి అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి కూడా లేదు. నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం పది మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ టిడిపికి ఆ స్థానాలు కూడా లేకుండా పోయాయి. ప్రతిపక్షాలు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటాయా అనేది వేచి చూడాల్సిన విషయం.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ అధికారపక్షం కార్పొరేట్ వ్యాపారులకే రాజ్యసభ సభ్యత్వం కల్పించడం వల్ల విమర్శలు వచ్చాయని, తెలంగాణలో ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని పార్టీ నాయకులు సూచిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సాధారణ కుటుంబానికి చెందిన పి దయాకర్కు టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి మంచి ఇమేజ్ లభించిందని, రాజ్యసభ ఎన్నికల్లో సైతం ఇదే విధానం అవలంబించే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష పదవి నిర్వహించిన డి శ్రీనివాస్ టిఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నా రాజ్యసభ సభ్యత్వం కల్పించడం ద్వారా తెలంగాణలో పెద్ద సంఖ్యలో డి శ్రీనివాస్ సామాజిక వర్గం మద్దతు కూడగట్టవచ్చుననే ఆలోచన ఓ వర్గం నుంచి వస్తోంది.
తెలంగాణ ఆవిర్భావ సమయంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం తెలంగాణ భవన్లో కెసిఆర్ను కలిసినప్పుడు రాజంను రాజ్యసభకు పంపిస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు. మీడియా ద్వారా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచినందుకు పారిశ్రామికవేత్త రాజంకు రాజ్యసభ సభ్యత్వం ఖాయం అని భావించారు.
దానికి తగ్గట్టు కెసిఆర్ స్వయంగా ఈ విషయం ప్రకటించారు. అయితే ఆ తరువాత రాజం బిజెపిలో చేరారు. తిరిగి టిఆర్ఎస్లోకి వచ్చారు. ఆయనకు రాజ్యసభ సీటు దక్కడం అంత సులభమేమీ కాదని అంటున్నారు.టిడిపి నుంచి టిఆర్ఎస్లో చేరిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఆశిస్తున్నారు. అయితే, ఆమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications