27న హుజూరాబాద్ కు కేసీఆర్ : నేడు టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీ-ముఖ్యమంత్రి దిశానిర్దేశం...!!
అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ బై పోల్ వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 30న జరగనుండగా ఈ నెల 27న ప్రచారం ముగియనుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రచార సభ ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 15న వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించే 'తెలంగాణ విజయ గర్జన' సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 27న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సభలు నిర్వహించాలని నిర్ణయించింది.
27న కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్
ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్న హుస్నాబాద్ లేదా ముల్కనూరులో సభ నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభ ద్వారానే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశాలను ప్రస్తావించే అవకాశముందని సమాచారం. ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్రెడ్డి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేశారు. నేటి నుంచి ఈనెల 22 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.
పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్
ఈనెల 23న స్క్రూటినీ, 24న నామినేషన్ల ఉపసంహరణ, 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 25న జరగనున్న ప్లీనరీపై కూడా చర్చించనున్నట్లు తెలియవచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం వ్యూహాలు ఖరారు చేయనున్నారు.
భవిష్యత్ రాజకీయాలపై దిశా నిర్దేశం
వీటితో పాటుగా ప్రధానంగా.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, టీఆర్ఎస్ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను అధినేత కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ప్రారంభించింది. ఆహ్వానితులకు మాత్రమే ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో సుమారు 14 వేల మంది ప్రతినిధుల పేరిట ఆహ్వాన లేఖలను పార్టీ రాష్ట్ర కార్యాలయం సిద్ధం చేస్తోంది.
ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా
మరోవైపు వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు అనువైన చోటు కోసం పార్టీ నేతలు అన్వేషణ ప్రారంభించారు. వరంగల్ నగరానికి సమీపంలోని మామునూరును మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలోని పార్టీ నేతల బృందం సందర్శించింది. కాగా, సోమవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ తరపున.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నామినేషన్లు వేయనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దూకుడుగా కనిపిస్తున్న టీఆర్ఎస్..ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల పైన ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల పైనే ఫోకస్
2018లోనే ఎన్నికలకు ముందుగానే వెళ్లి..విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పట్టు నిలబెట్టుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక, ఇప్పుడు హుజూరాబాద్ బై పోల్ లో విజయం ఖాయమంటూ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయం లో ఈటలకు సైతం ఈ బైపోల్ ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో..ఈ ఎన్నిక తరువాత తెలంగాణ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.