సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపే, నువ్వు గెలుస్తున్నావ్.. లక్కీ, అదే జగన్ కొంపముంచింది: కేసీఆర్ జాగ్రత్తలు
హైదరాబాద్: తాజాగా నిర్వహించిన సర్వేలో 82 స్థానాల్లో మనకే అనుకూలంగా ఉందని, నల్గొండ, గద్వాలలో మాత్రమే టీఆర్ఎస్కు, విపక్షాలకు సమాన ఓట్లు వస్తున్నాయని, మిగిలిన 30 చోట్ల కూడా మనదే విజయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన 105 మంది ఎమ్మెల్యేలతో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 100కు పైగా స్థానాల్లో మనమే గెలుస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగులు కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. తాను ప్రతి నియోజకవర్గంలోని బహిరంగ సభలో పాల్గొంటానని చెప్పారు. మన మేనిఫెస్టోకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తీసుకోవాలని చెప్పారు. వందకు పైగా సీట్లు గెలిస్తేనే సార్థకత అని, అప్పుడే తెలంగాణ బలం దేశానికి తెలుస్తుందన్నారు.

వంద స్థానాల్లో గెలిస్తే కేంద్రం మాట వింటుంది
మనం వంద స్థానాలు గెలిస్తే కేంద్రం కూడా మన మాట వింటుందని కేసీఆర్ చెప్పారు. ఇంటింటికి వెళ్లి ప్రతి లబ్ధిదారుడిని కలవాలని చెప్పారు. 1.75 కోట్ల మందికి తాను లేఖలు రాస్తానని చెప్పారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లలో త్వరలో బహిరంగ సభల్లో పాల్గొంటానని చెప్పారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మన గెలుపు చారిత్రక అవసరమన్నారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు.

ఆషామాషీగా గెలవడం కాదు
బ్రహ్మాండమైన మెజారిటీతో ఫలితాలను సాధించేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలు ప్రకటించాక విపక్షాల హామీలను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పారు. గతంలో ముందుగా ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధిగమించిందీ తెలిపారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, అధికారాన్ని, పదవులను త్యాగం చేసి మనం ప్రజల తీర్పు కోరామని చెప్పారు. ఆషామాషీగా గెలవడం కాదని, అద్భుత విజయం సాధించాలన్నారు. వంద సీట్లు గెలిస్తే కేంద్రం మెడలు వంచి అన్ని సాధించుకోవచ్చునని చెప్పారు. సాధారణ మెజారిటీతో గెలిస్తే కేంద్రంలో స్పందన ఉండదన్నారు.

అన్ని సర్వేలు టీఆర్ఎస్ వైపే
టీఆర్ఎస్, ఇతర సంస్థలు, కేంద్ర నిఘా విభాగాలు నిర్వహించిన సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, వంద సీట్లకు పైగా మనమే గెలుస్తామని చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. తాను ప్రతి నియోజకవర్గానికి వస్తానని కేసీఆర్ చెప్పారు. ఇదే సమయంలో అతివిశ్వాసం వద్దని కేసీఆర్ సూచించారు. ఇందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉదాహరణగా చెప్పారని తెలుస్తోంది.

అతివిశ్వాసం జగన్ కొంపముంచింది
2014 ఎన్నికల సమయంలో ఏపీలో తమదే విజయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిందని, పోలింగ్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్లాన్ ప్రకారం వ్యవహరించిందని, కాబట్టి ప్రతి ఓటు కీలకంగా భావించి గెలిచిందని, మనం కూడా దానిని పరిగణలోకి తీసుకొని పని చేయాలన్నారు.

నువ్వు లక్కీ.. గెలుస్తున్నావ్!
దేవరకద్ర నియోజకవర్గంలో 76 శాతం ప్రజలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారన్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ మంచి మెజార్టీతో టీఆర్ఎస్ ముందు ఉందని, అయితే అభ్యర్థులు ఎక్కడా అలసత్వం వహించొద్దని చెప్పారు. ఆందోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ లక్కీఫెలో అన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 35శాతం అనుకూలంగా ఉంటే, క్రాంతికిరణ్కు 50 శాతం అనుకూలంగా ఉందని సర్వేలు చెపుతున్నాయన్నారు. మిగిలినవి బాబూమోహన్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. తద్వారా బాబు మోహన్కు కేవలం 15 శాతానికంటే తక్కువ అనుకూలమని అభిప్రాయపడ్డారు. క్రాంతి గెలవబోతున్నాడని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో క్లీన్స్వీప్ చేయబోతున్నామని, రంగారెడ్డి జిల్లాలోనూ అనూహ్య ఫలితాలు రాబోతున్నాయన్నారు. హైదరాబాద్ నగర శివారు నియోజకవర్గాలన్నీ అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పెద్దఎత్తున ఓటింగ్ జరుగబోతున్నదన్నారు. జగిత్యాల ఈసారి టీఆర్ఎస్దే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని, మిగిలిన అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీ సాధిస్తారని కేసీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications