హలో రాజమౌళి గారూ... నేను కేసీఆర్ను మాట్లాడుతున్నా
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆరేంటీ? రాజమౌళికి ఫోన్ చేయడమేంటీ? అని అనుకుంటున్నారా? సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా రాజమౌళికి ఫోన్ చేశారు. అయితే అవతల ఫోన్ లిఫ్ట్ చేసింది మాత్రం టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాదు.
తన గ్రామాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కూసం రాజమౌళి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మొన్న గంగదేవిపల్లిలో సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఆరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో స్వయంగా కేసీఆర్, రాజమౌళికి ఫోన్ చేశారు. ‘‘హలో రాజమౌళి గారు...నేను కేసీఆర్ ను మాట్లడుతున్నా. మీ గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చాను కదా. జనం ఏం అనుకుంటున్నారు?'' అని కేసీఆర్ ఆయనను అడిగారట.
స్వయంగా సీఎం ఫోన్ చేయడంతో ఆశ్చర్యపోయిన రాజమౌళి ఆనందపడిపోతూ కృతజ్ఞతలు తెలిపారు. 'గంగదేవిపల్లికి రావడం సంతోషాన్నిచ్చిందని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం ఓ మధురమైన అనుభూతి' అని రాజమౌళి అన్నారు.