భరత్ భూషణ్ కుటుంబానికి అండగా కేసీఆర్ సర్కారు
హైదరాబాద్: సాహిత్యం, చిత్రకళ, పోటోగ్రఫీ తదితర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవిత కాలం కృషి చేసిన నాటి తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నది. ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.
భరత్ భూషణ్ కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి ఆదుకున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబానికి తానున్నానంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది.

గతంలో భరత్ భూషణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి ఆరోగ్య నిధి నుంచి ప్రభుత్వం చేయూతనందించింది. తమను కష్టకాలంలో ఆదుకుంటూ, ఇప్పుడు తమకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి మరోసారి అండగా నిలిచినందుకు భరత్ భూషణ్ భార్య సుభద్రమ్మ, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
భరత్ భూషణ్ గురించి మరింత సమాచారం:
భరత్ భూషణ్ విలక్షణమైన శైలికలిగిన తెలంగాణ ఫొటోగ్రాఫర్. ఫోటోగ్రఫీని పెయింటింగ్ లాగా భావించేవారు. నాలుగు దశాబ్దాల పాటు వినూత్న శైలితో ఫోటోగ్రఫీలో విశేష సేవలందించిన భరత్ భూషణ్ 1953లో వరంగల్ జిల్లాలో జన్మించారు. తెలంగాణ సంస్కృతి, గ్రామీణ జీవన స్థితిగతులపై అనేక ఫోటో ప్రదర్శనలిచ్చి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును భరత్ భూషణ్ పొందారు.
గొప్ప గొప్ప ఫోటోలు తీసి భద్ర పరిచారు. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో వందలాది ఫోటోలు తీసిన గొప్ప వ్యక్తిగా భరత్ భూషణ్ కీర్తి గడించారు. తెలంగాణ సాంస్కృతిక సామాజిక జీవన చిత్రానికి భరత్ భూషణ్ ఫోటోలు కేరాఫ్ అడ్రస్ అనడంలో అతిశయోక్తి యేమీలేదు. నాలుగు దశాబ్ధాలపాటు కలర్ ఫోటోగ్రఫీలో విశేష ప్రశంసలందుకున్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఫోటోలు కావాలనుకుంటే వెంటనే గుర్తుకువచ్చే ఫోటోగ్రాఫర్ పేరు భరత్ భూషణ్. ఎటువంటి సందర్భానికి సంబంధించిన ఫోటో కావాలని అడిగినా దొరికేవి. బతుకమ్మ బోనాలు సహా పలు తెలంగాణ పండుగలు, పల్లె వాతావరణం ముఖ్యంగా నాటి ఇండ్లు, ఇండ్ల దర్వాజలు కిటికీలు సహా తెలంగాణ సాంస్కృతిక జీవన చిత్రాలను ఫోటోలు తీసి భద్రపరిచేవారు. ఎందరో రచయితలు తాము రాసిన పుస్తకాలకు భరత్ భూషణ్ తీసిన ఫోటోలను ముఖ చిత్రాలుగా ప్రచురించుకున్నారు.

తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్ ను డాక్యుమెంట్ చేసి తెలంగాణ సంస్కృతిపై తనకున్న ప్రత్యేక శ్రద్ధను భరత్ భూషణ్ చాటుకున్నారు. 2జూన్, 2015న జరిగిన తెలంగాణ రాష్ట్ర మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా 'ది బెస్ట్ ఫోటో జర్నలిస్టు అవార్డు' అందుకున్నారు. భరత్ భూషణ్ తన జీవిత కాలంలో ఏడు సోలో ఫోటో ఎగ్జిబిషన్లు, ఆరు ఆర్ట్ షోలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు.
సహజమైన వెలుగులో లైట్లు లేకుండా ఫోటోలు తీయడం భరత్ భూషణ్ ప్రత్యేకత. ఫోటో జర్నలిస్టుగా అనేక తెలుగు మ్యాగజైన్లకు ఫ్రీలాన్సర్ గా పనిచేశారు. ఫిల్మ్ మ్యాగజైన్ 'చిత్రభూమి', 'ఆదివారం' మ్యాగజైన్ లకు రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేశారు. చిత్రకారుడైన భరత్ భూషణ్ తెలుగులో, ఇంగ్లీష్ లో పలు వ్యాసాలు కూడా రాశారు. వందలాది బొమ్మలు గీశారు. సినిమా రంగంలో కూడా ఆయన సేవలందించారు. 1980 ప్రాంతంలో వచ్చిన 'మా భూమి' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు.
అళిశెట్టి కుటుంబానికి అండగా సర్కారు
తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి, తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయించి అలిశెట్టి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాకు చెందిన అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడుగా, ఫోటోగ్రాఫర్ గా అభ్యుదయ కవిగా సమాజం కోసం నిరంతరం శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసాడు. మనసున్న ప్రతి మనిషిని తన కవిత్వంతో కదిలించినవాడు అలిశెట్టి.












Click it and Unblock the Notifications