కేసీఆర్దే ఫైనల్: కొత్తగా 14 లేదా 16 జిల్లాలు, జోనల్ వ్యవస్థపై తర్జన
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు మరో పద్నాలుగు లేదా పదహారు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలని కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో రెండు చొప్పున, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త జిల్లాలు ఉండాలని సూచించారు.
కొత్త జిల్లాల ఆవిర్భావంతో తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరిగింది. వారు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. మంగళవారం కూడా దీనిపై చర్చ జరగనుంది.
దేశంలో ప్రస్తుతం జిల్లాల సగడు జనాభా 19 లక్షలు కాగా, తెలంగాణలో జనాభా 35 లక్షలుగా ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లాల వారీ జనాభాను జాతీయ సగటుకు కుదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు రూపుదిద్దుకుంటున్నాయి.

సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్లు తమ నివేదికలను సీఎస్కు అందజేశారు. ఇందులో జిల్లాలపై స్పష్టత వచ్చింది. వాటన్నింటిపై తుదినివేదిక రూపొందించి సీఎంకు ఇస్తారు. మండలాలు, డివిజన్ల విభజన అంశాన్ని మరోసారి పరిశీలించాలని సూచించారు.
అదిలాబాద్ జిల్లాలో అదిలాబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, రంగారెడ్డి ఉత్తర, రంగారెడ్డి దక్షిణ, హైదరాబాదులో హైదరాబాద్, సికిందరాబాద్, వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం , నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రిలు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్లు ప్రతిపాదించారు. కొత్త జిల్లాల పైన కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో దసరా నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభానికి సన్నాహాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాత్కాలిక భవనాల్లో కొత్త కలెక్టరేట్లను ప్రారంభించాలని, మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. కొత్త భవనాల కోసం నిర్మాణ స్థలాలను ఎంపిక చేయాలన్నారు.
జోనల్ వ్యవస్థపై..
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు... విద్యా కోర్సుల్లో ఇతర కీలక అంశాలకు సంబంధించి అత్యంత కీలకమైన జోనల్ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం దీనిపై దృష్టి సారించనుంది. న్యాయసలహాతో పాటు అన్ని పర్యవసానాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత విధానం కిందనే జిల్లాల పునర్య్వవస్థీకరణ ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లు ఉండగా, తెలంగాణ ఆవిర్భావం అనంతరం రెండు జోన్లు మిగిలాయి. ప్రస్తుతం రాష్ట్రమంతా రెండు జోన్లుగానే ఉంది.












Click it and Unblock the Notifications