ప్రత్యూషపై చలించిన కెసిఆర్: బాధ్యత తెలంగాణదే, వారం పాటు సిఎం ఇంట్లో
హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతిలో చిత్రహింసలకు గురైన 19 ఏళ్ల యువతి ప్రత్యూష జీవితంలో వెలుగులు నింపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు నిర్ణయించారు. అందరూ ఉన్నా అనాథలా మారిన ప్రత్యూష వేదనను చూసి కెసిఆర్ చలించిపోయారు. ఆమె బాధ్యతలు పూర్తి తీసుకోవాలని నిశ్చయించారు.
సవతి తల్లి చేతిలో తీవ్ర గాయాలపాలై సరూర్నగర్లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రత్యూషను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా శనివారం ఉద యం పదిగంటలకు వెళ్లనున్నారు. ప్రత్యూషను తన ఇంటికి తీసుకువచ్చి, వారంపాటు తన వద్దే ఉంచుకోవాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రత్యూష చదువుసంధ్యల బాధ్యతను ఇకపై తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా తీసుకోనుంది. ప్రత్యూష బాగోగులను తానే స్వయంగా పర్యవేక్షించాలని సీఎం భావిస్తున్నారు. అటు సవతి తల్లి, ఇటు కన్నతండ్రినుంచి నిరాదరణకు గురైన ప్రత్యూష భవిష్యత్ ప్రశ్నార్థకమై ఉన్న తరుణంలో ఆమె బాధ్యత ఎవరు చూడాలన్న విషయంలో హైకోర్టు సైతం దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
బంధువులు ఉన్నా ఆమెను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై హైకోర్టు విచారం కూడా వ్యక్తం చేసింది. ప్రత్యూష విషయం పట్ల కెసిఆర్ తీవ్రంగా కలత చెందారని సమాచారం. గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఏం చదవాలనుకుంటున్నది? ఎక్కడ ఉంచాలి? ఆమెకు మంచి భవిష్యత్తు అందించేందుకు తానేం చేయగలను? అనే అంశాలను నిర్ణయించాలని సీఎం భావిస్తున్నారు. ఆమె చదువకు అయ్యే ఖర్చును కూడా భరించాలని సీఎం నిర్ణయించారు.
దాదాపు ఆరు నెలలుగా చిత్రహింసలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ప్రత్యూష దుస్థితిని బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావు ఎల్బీనగర్ పోలీసుల సహాయంతో వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సవతితల్లి చాముండేశ్వరిని, తండ్రి రమేశ్ను పోలీసులు ఇప్పటికే అరెస్టుచేశారు. రమేశ్ బీఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్గా పని చేస్తున్నాడు. దాదాపు ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ప్రత్యూష చికిత్స అనంతరం కోలుకుంటున్నది.