డబ్బులడిగితే భార్య వెళ్లిపోయిందని హేళన, పిలిచి నరికి చంపారు (ఫొటోలు)
హైదరాబాద్: సెకండ్హ్యాండ్ ద్విచక్ర వాహనాల వ్యాపారం చేసే ఓ యువకుడు ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదులోని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తూర్పు మండలం డీసీపీ డాక్టర్ రవీందర్ సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
రాంకోఠి ప్రాంతానికి చెందిన షేక్ ఖాదర్పాషా (32) కింగ్కోఠి ప్రాంతంలో స్పీడ్ మోటార్స్ పేరుతో ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసి విక్రయిస్తుంటాడు. రాంకోఠి ప్రాంతానికే చెందిన మహ్మద్ సర్ఫరాజుద్దీన్ఖాన్ (28) అలియాస్ డాక్టర్ కూడా ఇక్కడే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. మూడేళ్ల క్రితం వాహనాల విషయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.
అంతేకాకుండా ఆర్థిక పరమైన లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. ఇదిలా ఉండగా మూడు సంవత్సరాల క్రితం షేక్ ఖాదర్పాషా వివాహం హుమాయున్నగర్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన నేహా ఆఫ్రిన్తో జరిగింది. ఏడాది క్రితం భర్తతో గొడవ కారణంగా నేహా ఆఫ్రిన్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో షేక్ ఖాదర్పాషాతో తరుచుగా భార్య విడిచి పోయిందంటూ సర్ఫరాజుద్దీన్ హేళనగా మాట్లాడేవాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఆదివారం రోజు ఖాదర్పాషా తనకు రావాల్సిన డబ్బుల విషయమై సర్ఫరాజ్కు పలు పర్యాయాలు ఫోన్ చేసినా ఎత్తలేదు.అనంతరం రాత్రి 11 గంటల సమయంలో డబ్బుల విషయం మాట్లాడుకుందామని సర్ఫరాజ్ అతనిని రాంకోఠికి పిలిచాడు.అంతకు ముందే హత్య చేయాలని నిర్ణయించుకుని హసన్నగర్ ప్రాంతానికి చెందిన షబాబ్ హస్మీ (23) సహాయం తీసుకున్నాడు
పారిపోవడానికి కూడా ప్లాన్ వేసుకున్నాడు. తన సోదరుడు సమియుద్దీన్ఖాన్ (23)కి ఫోన్ చేసి ఖాదర్పాషాను హత్య చేస్తున్నామని, అనంతరం పారిపోవడానికి వాహనం తీసుకురావాలని చెప్పడంతో అతను రాజ్మొహల్లా ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు ఎండీ షాదాబ్ (23)తో వాహనం అక్కడికి పంపాడు.
అనంతరం కారులో వచ్చిన ఖాదర్పాషాపై వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి వాహనంపై పరారయ్యారు.సమాచారం అందుకున్న సుల్తాన్బజార్ ఏసీపీ రావుల గిరిధర్ వెంటనే అక్కడికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న ఖాదర్పాషాను హైదర్గూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలిస్తుండగా మార్గ మద్యలోనే మృతి చెందాడు. దీంతో పోస్ట్మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
షేక్ ఖాదర్పాషాపై దాడి అనంతరం నిందితులు పరారయ్యేందుకు గాను సోమవారం ఎంజీబీఎస్కు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి హత్యకు పాల్పడిన సర్ఫరాజుద్దీన్, షహబ్ హష్మీలతో పాటు వారికి సహకరించిన సమీయుద్దీన్ఖాన్, షాదాబ్లను అరెస్ట్ చేశారు.
హత్య అనంతరం నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన సుల్తాన్బజార్ పోలీసులతో పాటు టాస్క్ఫోర్సు పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో టాస్క్ఫోర్సు అధనపు డీసీపీ కోటిరెడ్డి,తూర్పు మండలం అధనపు డీసీపీ ఎల్టీ చంద్రశేఖర్,సుల్తాన్బజార్ ఏసీపీ రావుల గిరిధర్,ఇన్స్పెక్టర్ శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు.