కిషన్ రెడ్డి ప్రమోషన్కు కారణం నేనే... టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆసక్తికర కామెంట్స్...
బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్లో స్థానం దక్కడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటిదాకా కేంద్రంలో సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ రావడానికి తానే కారణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు తాను చేపట్టడంతో తనను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే కిషన్ రెడ్డికి కేంద్ర పెద్దలు ఆ పదవి ఇచ్చారని అన్నారు.
'నా రూపంలో తెలంగాణ కాంగ్రెస్కు బలమైన అధ్యక్షుడు ఉన్నాడు. నన్ను ఎదుర్కోవాలంటే తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వం కూడా బలంగా ఉండాలని కేంద్ర పెద్దలు భావించారు. అందుకే కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు.' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటు టీఆర్ఎస్,సీఎం కేసీఆర్లపై కూడా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గాలివాటుగా గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణమే లేదన్నారు. కాబట్టి ఆ పార్టీ ఎప్పుడైనా పేకమేడలా కూలిపోవచ్చునని అన్నారు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ సోనియాను మోసం చేశారని రేవంత్ ఆరోపించారు. వచ్చే ఏడాది అగస్టు తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అన్నారు. కేటీఆర్ను కేసీఆర్ ముఖ్యమంత్రి చేయరని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 72 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video
ఇక మంత్రులు కేటీఆర్,హరీశ్ రావులు చేసిన విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.తనపై విమర్శలు చేసేందుకు మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్ పోటీ పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.తాను టీడీపీ నుంచి వచ్చానంటూ తనపై పదేపదే విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు... సీఎం కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చినవాడేనని గుర్తుంచుకోవాలన్నారు.తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ అయితే... టీఆర్ఎస్ కూడా టీడీపీనే అని విమర్శించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తలసాని,మల్లారెడ్డి,గంగుల... వీరంతా టీడీపీ నుంచి వచ్చి చేరినవారేనని అన్నారు.