కొడంగల్ కాంగ్రెస్ నేతలను రాహుల్ గాంధీ చేత సన్మానం చేయిస్తా.!కోస్గీ సభలో రేవంత్ రెడ్డి.!
కోస్గి/హైదరాబాద్ : కొడంగల్ నియోజకవర్గంలో 75వేల సభ్యత్వం నమోదు చేయడాన్ని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి అభినందించారు. డిజిటల్ సభ్యత్వ నమోదుకు సంబందించిన సమావేశానికి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచిందని రేవంత్ ప్రశంసించారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన కార్యకర్తల్ని సత్కరించారు. 20 వేలు సభ్యత్వం నమోదు చేసిన వారికి గాంధీ భవన్ లో సన్మానం చేయిస్తామని తెలిపారు. 10 వేలు సభ్యత్వం నమోదు చేసిన మండలాల నాయకుల్ని రాహుల్ గాంధీతో కలిపిస్తానని రేవంత్ రెడ్డి పర్కొన్నారు.
కొడంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా..?టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలు సంక్షేమ పాలనను అందుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వినూత్న పథకాల్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ సొంతమని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు అటకెక్కాయని విమర్శించారు. కొడంగల్ లో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదులో సత్ఫలితాలు సాధించిన కార్యకర్తల్ని రేవంత్ సన్మానించారు. వికారాబాద్ జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, ఇళ్లు పంపిణీ, విద్యార్థులకు ఫీజు రీఅంబర్స్ మెంట్ ఇచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి. టీఆర్ఎస్ సంక్షేమాన్ని విస్మరించిందన్న పీసిసి ఛీఫ్
ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించినట్టు చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 72వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిందని తెలిపారు. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించడం, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం కాంగ్రెస్ ఘనత అని రేవంత్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. సీఎం చంద్రవేఖర్ రావు పాలనలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పరిస్థితి గురించి ప్రజలు ఆలోచించాలని రేవంత్ సూచించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగాలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులపై దాడులు, కేసులు పెరిగాయని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి బీసీ వర్గాల్ని ఆదుకున్నట్టు చెప్పారు. పదవుల కేటాయింపులోనూ సామాజిక న్యాయం పాటించిందని రేవంత్ తెలిపారు.
వడ్డీతో సహా చెల్లిస్తాం.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించొద్దన్న రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఏ ఒక్కరిపైనా అక్రమ కేసులు పెట్టించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఈ రోజు టీఆర్ఎస్ లీడర్లు ప్రశ్నించిన పాపానికి వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసుల్లో కొందరు.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటికీ టీఆర్ఎస్ ఉండబోదని, కాంగ్రెస్ రాజ్యం వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడిన పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. ఎమ్మెల్యే, ఎస్ఐ, రైసు మిల్లర్లు అధికార పార్టీ నేతలకు కమీషన్లు చెల్లించలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆగడాలు ఆపాలని, తమ ఓపికకు హద్దు ఉంటుందని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.
రుణం తీర్చుకుంటా..తాను కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను అన్న రేవంత్
కొడంగల్ ప్రజలు నాటిన మొక్కగా ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగానని రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా నది జలాల్ని ప్రజలకు అందించినప్పుడే రుణం తీర్చుకున్నట్టు అవుతుందని తెలిపారు. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు ద్వారా లక్షా 7 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని మండలాల్లో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కాలేజీలు తీసుకొస్తామని తెలిపారు. ప్రతీ తండాకు బీటీ రోడ్డు వేయిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారు వెనక్కి వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి అని రేవంత్ స్పష్టం చేసారు.