పాపం ఎవరిది, 25కు చేరిన మృతులు: 'దైవం'పై మమత ఆగ్రహాం, ఆఫీస్ సీజ్
హైదరాబాద్: కోల్కత్తాలో నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కూలిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 25కు చేరింది. బుధవారం రాత్రికే 21 మంది మృతదేహాలను వెలికితీసిన సహాయక సిబ్బంది, శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. గురువారం మధ్యాహ్నాం జరిగిన ఈ దుర్ఘటనలో 88 మందికి గాయాలు పాలవ్వగా, మరో 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు కోల్కత్తా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో శిథిలాలను తొలగిస్తున్నారు.
అయితే ఈ ప్లైఓవర్ను నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీ హైదరాబాద్కు చెందినది కావడం విశేషం. హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఎదిగిన 'ఐవీఆర్సీఎల్' ఈ ఫ్లై ఓవర్ పనులు చేస్తోంది. మరోవైపు ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందని బెంగాల్ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది.
దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఐవీఆర్సీఎల్పై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన కోల్కత్తా పోలీసులు కంపెనీకి చెందిన మూడు కార్యాలయాలను గురువారం సీజ్ చేశారు. కార్యాలయాల్లో ముమ్మరంగా సోదాలు చేసిన తర్వాత పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో పాటు కంపెనీపై శుక్రవారం ఉదయం సెక్షన్ల కింద కేసులు కేసు నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ప్లైఓవర్ కూలి 25 మంది చనిపోయిన ఘటనపై ఐవీఆర్సీఎల్ కంపెనీ ప్రతినిధి పాండురంగారావు ఈ దుర్ఘటనను 'దైవ ఘటన' అభివర్ణించారు.
ఈ ప్రకటనపై అటు కోల్కత్తా ప్రజలతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారంటూ మండిపడ్డారు. త్వరలో పశ్చిమ బెంగాల్లో ఈ దుర్ఘటనపై రాజకీయలు వేడెక్కాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి పరిహారం విషయంలో సరైన సహాయం అందడం లేదని ఆరోపణలను కూడా మమత ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఓటు బ్యాంకు రాజకీయాలే ఈ దుర్ఘటనకు కారణమయ్యాయని దీదీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇది ఇలా ఉంటే హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఐవీఆర్సీఎల్ ప్రధాన కార్యాలయం ఉంది.
ప్లైఓవర్ కూలిన ఘటనలో కోల్కత్తాకు చెందిన విచారణ బృందం ఐవీఆర్సీఎల్ ఉన్నతాధికారులను ప్రశ్నించేందుకు గాను ఈరోజు ఉదయం హైదరాబాద్లోని సంస్ధ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సంస్థ యాజమాన్యం, ఉన్నతాధికారులను విచారిస్తున్నారు.
ఈ విచారణలో ఐవీఆర్సీఎల్ ఉన్నతాధికారులు సరైన సమాధానాలు చెప్పని పక్షంలో సంస్థ యాజమాన్యం, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏ క్షణంలోనైనా సంస్థ ఉన్నతాధికారులతో పాటు యాజమాన్యానికి చెందిన ప్రతినిధులను కూడా బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది.