కెసిఆర్! నవ్వాలా, ఏడ్వాలా: ఏపీని చూపించి కోమటిరెడ్డి ఫైర్, కిషన్కు నాగం ఝలక్
హైదరాబాద్: ఓ వైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే గ్రామజ్యోతి అవసరమా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూ.5 లక్షల పరిహారం ఇస్తుంటే ధనిక రాష్ట్రమని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
గురువారం నాడు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ పైన మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తీరు చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. కెసిఆర్ ఎన్నికల హామీలను పక్కన పెట్టి రోజుకో కొత్త ప్రకటన చేస్తున్నారన్నారు. కెసిఆర్కు ఏ విషయాన్ని చెప్పే ధైర్యం మంత్రులకు లేదని ఎద్దేవా చేశారు.
టిఆర్ఎస్, టిడిపి విఫలం: మధుయాష్కీ
టిడిపి, టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో సమస్యలను ప్రస్తావించడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ ఢిల్లీలో అన్నారు. విభజన హామీలను అమలు చేయించుకోలేకపోయారని మండిపడ్డారు. టిఆర్ఎస్ ఎంపీలు వెంకయ్య నాయుడుకు భయపడ్తున్నారన్నారు. ప్రధాని మోడీ పార్లమెంటుకు రావడమే కష్టంగా మారినట్లుందన్నారు.
సొంతపార్టీ నేతల్నే ముఖ్యమంత్రి నమ్మడం లేదు: కిషన్ రెడ్డి
మంత్రులు, సొంతపార్టీ నేతలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నమ్మడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వేరుగా మండిపడ్డారు.
సీఎం తన స్థాయి మరిచి విపక్షాలపై విమర్శలు చేస్తున్నారన్నారు. సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కిషన్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం తీరు సరికాదన్నారు. ఉద్యోగాలను కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితం చేయడం పని తీరుకు నిదర్శనమన్నారు.
కిషన్ రెడ్డికి నాగం, యెన్నం ఝలక్
బిజెపి జిల్లా సమావేశంలో లుకలుకలు బయటపడ్డాయి. ఆ పార్టీ జిల్లా సీనియర్ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డులు గైర్హాజరయ్యారు. కిషన్ రెడ్డి సమావేశం విషయమై తమకు సమాచారం లేదని నాగం అనుచరులు చెబుతున్నారు.