మునుగోడు బైపోల్ తర్వాత అదే జరిగేది, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడు ప్రజలకు ముందుగా క్షమాపణలు చెప్పిన తర్వాత ఇక్కడికి రావాలని అన్నారు. శుక్రవారం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కుట్రపూరితంగానే కేసీఆర్ రేపటి సభ: రాజగోపాల్ రెడ్డి
ఆగస్టు 21న మునుగోడులో కేంద్రమంత్రి అమిత్ షా బహిరంగసభ ఉంటుందని ముందు చెప్పామని, అయితే.. కేసీఆర్ కుట్ర పూరితంగా శనివారం సభ నిర్వహిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఏం అభివృద్ధి చేశారని మునుగోడు వస్తారని సీఎం కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. ఎక్కడ ఉపఎన్నికలు ఉంటే అక్కడ నిధులు కేటాయిస్తున్నారని, మునుగోడు బైపోల్ వస్తుందనే కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు రాజగోపాల్ రెడ్డి.
కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కోరుకుంటున్నారు: కోమటిరెడ్డి
మునుగోడు నియోజకవర్గం అంటే సీఎంకు అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధికి పెట్టిన ఖర్చు, మునుగోడు డెవలప్మెంట్కు పెట్టిన ఖర్చు వివరాలు చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో తెలంగాణ బందీ అయ్యిందని.. ప్రస్తుతం విముక్తి కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుతరాల కోసం సరైన నిర్ణయం తీసుకుని ఉపఎన్నికలో కేసీఆర్కు బుద్ధి చెప్పాలని మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
మునుగోడు బైపోల్ తర్వాత కేసీఆర్ గ్రాఫ్ మరింత దిగజారుతుంది!
మరోవైపు, భూ నిర్వాసితులు ఆరేళ్లుగా పరిహారం కోసం తిరుగుతున్నా.. నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా.. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వివేక్ వెంకటస్వామితో కలిసి పోరాటం చేసి, రాష్ట్ర సాధనలో ముందున్నామని తెలిపారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం తీసుకుని మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఇది ఇలావుండగా, సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి విమర్శలు ఎక్కుపెట్టారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ గ్రాఫ్ మరింతగా దిగజారుతుందన్నారు. మునుగోడులో అమిత్ షా సభ తర్వాత మార్పు వస్తుందన్నారు. ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్కు నియోజకవర్గం గుర్తుకు వస్తుందని వివేక్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓట్లేసిన ప్రజలను మర్చిపోతారని విమర్శించారు. కమీషన్లతో కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతి జరిగిందన్నారు.