ఈనాటి బంధం ఆనాటిదేనా? ప్రీ ప్లాన్ తోనే కొండా జంపా..! చేరకముందే 2 టికెట్లు దక్కించుకున్నారా?
హైదరాబాద్ : కొండా జంప్ పాత స్కెచ్చేనా..! కాంగ్రెస్ పార్టీతో ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉందా? టీఆర్ఎస్ లో జరగని లాబీయింగ్.. కాంగ్రెస్ పార్టీలో దక్కిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. గులాబీవనంలో సరైన ప్రాధాన్యత లభించకపోవడంతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పాననేది కొండా వాదన. అయితే ఆయన టీఆర్ఎస్ ను వీడటం అనూహ్య పరిణామం కాదనేది విశ్లేషకుల అంచనా. అదలావుంటే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోకముందే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీ నుంచి తనవాళ్లకు రెండు టికెట్లు దక్కించుకోవడం చర్చానీయాంశంగా మారింది.
ఆ నలుగురు నడిచే దారిలో తాను నడవలేనంటూ పరోక్షంగా టీఆర్ఎస్ కుటుంబ పాలనపై కొండా అసహనం వ్యక్తం చేయడం కొత్త నిర్ణయేమీ కాదు. చేవెళ్ల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేతలతో అనుబంధం పాతదే. కొన్ని అంశాలు కూలంకషంగా పరిశీలిస్తే ఇది నిజమని అర్థమవుతుంది.
టీఆర్ఎస్ లో నో ఛాన్స్.. కాంగ్రెస్ లో హవా
టీఆర్ఎస్ లో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధాన ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గులాబీ పెద్దలు తనవారికి టికెట్లు ఇవ్వకపోవడం ఆయనను మరింత బాధించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం కారణంగానే తనవాళ్లకు ఆ పార్టీ నుంచి రెండు టికెట్లు సాధించుకున్నట్లు అర్థమవుతోంది.
చేవేళ్ల నుంచి కేఎస్ రత్నం, తాండూర్ నుంచి రోహిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కడం వెనుక కొండా హస్తమున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు కూడా కొండాకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డవారే. కేఎస్ రత్నం 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయనకు టీఆర్ఎస్ టికెటివ్వలేదు. దీంతో కొండానే చక్రం తిప్పి రత్నంకు కాంగ్రెస్ టికెట్ వచ్చేలా చేశారనే టాక్ ఉంది. అటు రోహిత్ రెడ్డికి గులాబీ టికెట్ ఇప్పించాలని కొండా ప్రయత్నించినా.. పార్టీలో పట్నం సోదరుల హవా కారణంగా తనను పట్టించుకోలేదనేది ఆయన బాధకు మరో కారణంగా కనిపిస్తోంది.
కుటుంబ పాలన కొండా ఔట్ కు కారణమా?
గులాబీవనంలో కుటుంబ పాలనతో కొండా విసిగిపోయారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టికెట్ల విషయంలో మాట్లాడదామని వెళితే కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటే.. కేటీఆర్ నవ్వులతో సమాధానం చెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఒక ఎంపీగా రెండు స్థానాలు ఇప్పించుకోలేకపోతున్నాననే భావన ఆయనను కృంగదీసినట్లు సమాచారం. రోహిత్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒకచోట టీఆర్ఎస్ టికెట్ ఇప్పించాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన వృత్తీరీత్యా కాంట్రాక్టర్ అంటూ ఏవో సమాధానాలు చెప్పి టికెట్ కేటాయించలేదని తెలుస్తోంది. అటు కేఎస్ రత్నం విషయంలోనూ పార్టీ పెద్దల దగ్గర కొండా మంత్రాంగం పనిచేయలేదు. దీంతో తనకు సముచిత ప్రాధాన్యత దక్కలేదని కొండా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినట్లు సమాచారం.
జిల్లాలో పట్నం హవా.. అందుకేనా కొండా రాజీనామా?
రంగారెడ్డి జిల్లాలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి అంతా తానై వ్యవహరిస్తుంటారు. అటు పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఆయనకు పెద్దపీట వేస్తారనే టాక్ ఉంది. ఈక్రమంలో పట్నం ఇంటి నుంచి టీఆర్ఎస్ కు రెండు టికెట్లు దక్కడం కూడా అందులోభాగమే. మహేందర్ రెడ్డి తాండూర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సోదరుడు కొడంగల్ నుంచి బరిలో నిలిచారు. మరికొన్ని చోట్ల కూడా మహేందర్ రెడ్డి చెప్పిన వారికే టికెట్లు దక్కాయని సమాచారం. ఈనేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాను రెండు టికెట్లు అడిగితే అధిష్టానం ఒప్పుకోకపోవడంతోనే పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
బుజ్జగింపులు నడవలే.. కేటీఆర్ స్ట్రాటజీపై అనుమానాలు..!
ఎన్నికల పర్వం మొదలైన నాటినుంచి టీఆర్ఎస్ లో కేటీఆర్ చక్రం తిప్పుతున్నారనే వాదనలున్నాయి. టికెట్ల కేటాయింపులో కూడా ఆయన జోక్యం బాగానే పనిచేసిందనే కథనాలొచ్చాయి. అయితే కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరక్క.. కేటీఆర్ ను సంప్రదిస్తే కొండాకు నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. ఏవో కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీకి కొండా గుడ్ బై చెప్పిన వేళ.. కేటీఆర్ బుజ్జగింపులకు దిగారు. అయితే ఆయన మంత్రాంగం పనిచేయలేదు. ససేమిరా అంటూ కొండా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఒక ఎంపీని కాపాడుకోలేని కేటీఆర్ పొలిటికల్ స్ట్రాటజీపై చాలానే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పట్నంపై పగా? కొండాతో దెబ్బ
రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ నేతగా హవా నడిపిస్తున్న పట్నం మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి కక్ష్య సాధిస్తున్నారా? కొడంగల్ నుంచి తనపై పోటీగా టీఆర్ఎస్ నుంచి ఆయన సోదరుడిని బరిలో దించడం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తాయి. టీఆర్ఎస్ టార్గెట్ గా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ.. రంగారెడ్డి జిల్లాలో పట్నం సోదరులకు చెక్ పెట్టాలనేది రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే కొండా రూటును ఇలా యూ టర్న్ చేయడంలో రేవంత్ రెడ్డియే లీడ్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.